హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. వరి పంటను సంప్రదాయ పంటగా భావిస్తున్న రైతులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో యాసంగిలో వివిధ పంటల సాగుపై వ్యవసాయ నిపుణులు పలు కీలక సూచనలు చేస్తున్నారు. వానకాలంలో వరి సాగుచేస్తే సరిపోతుంది..యాసంగిలోనూ వరి వేయడం వల్ల నష్టమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎక్కువ వరి సాగుచేయడం వల్ల అనేక రకాల నష్టాలున్నాయి. తెలంగాణలో కొన్నేండ్లుగా వరి విస్తీర్ణం భారీగా పెరుగుతున్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించాల్సిందే. లేదంటే భూమి పరంగా, వాతావరణ పరంగా, ఆరోగ్యపరంగా నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. తెలంగాణలో నీళ్లు చాలా విలువైనవి. కాబట్టి వీటిని చాలా జాగ్రత్తగా వినియోగించాలి. అంతేగానీ ఈ నీరు మొత్తం వరికే పరిమితం చేయకూడదు. యాసంగిలో బోర్ల కింద వరి తగ్గించి ఇతర పంటలను ప్రోత్సహించే బాగుంటుంది.
ప్రొ. రామాంజనేయులు, వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం.
యాసంగి వరితో నష్టాలు
రాష్ట్రంలో వరిసాగును తగ్గించి ఇతర పంటల సాగును పెంచాల్సిన అవసరమున్నది. ఇందుకోసం వరి సాగుకు ఇస్తున్న ప్రోత్సాహకాలను తగ్గించి.. ఇతర పంటల సాగుకు ప్రోత్సాహకాలను పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రొఫెసర్ జలపతిరావు, వ్యవసాయ నిపుణుడు
ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. అన్నం తినడానికి బదులు చిరు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఏర్పడింది. రైతులు చిరుధాన్యాలను సాగుచేస్తే అధిక లాభాలు పొందవచ్చు.
ప్రొఫెసర్ బీ గంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త, చిరుధాన్యాల పరిశోధన కేంద్రం
వరిసాగుతో పోల్చితే కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు ఎంతో మేలు. ఉద్యాన పంటల సాగులో లాభాలు ఎక్కువ.. నష్టాలు తక్కువ. రైతు కష్టానికి తగిన ఫలితం అందుతుంది. అది కూడా తక్కువ సమయంలోనే చేతికందుతుంది.
డాక్టర్ సైదయ్య, ఉద్యాన వర్సిటీ