హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సాగు ప్రారంభమైంది. ఓ వైపు వానకాలం వరి కోతలు కొనసాగుతుండగానే మరోవైపు యాసంగి నాట్లు కొనసాగుతున్నాయి. గురువారం వరకు మొత్తం 96 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వేరుశనగ 55 వేల ఎకరాలు, శనగ 16 వేల ఎకరాలు, మొక్కజొన్న 7,300 ఎకరాలు, వరి 4,800 ఎకరాల్లో సాగు చేసినట్టు పేర్కొన్నది. గత యాసంగి మాదిరి ఈ సారి కూడా అంచనా మించి వివిధ పంటలు సాగవుతాయని తెలుస్తున్నది. వరిపై ఆంక్షలు లేకపోవడం, ఇతర పంటలకు భారీగా డిమాండ్ ఉండటం, వానలకు చెరువులు నిండటం, అనుకూల వాతావరణంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నది. ఈ సీజన్లో 47.85 లక్షల ఎకరాల్లో సాధారణ సాగు విస్తీర్ణం ఉంటున్నదని వ్యవసాయ శాఖ పేర్కొనగా, 60 లక్షల ఎకరాలకు పైనే ఉంటుందనే అంచనాలున్నాయి.
రాష్ట్రంలో వానకాలం ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. గురువారం వరకు రూ.58 వేల కోట్ల విలువైన 30 వేల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. మొత్తం 6,713 కొనుగోలు కేంద్రాలకుగాను 1,304 కేంద్రాలను ప్రారంభించింది.