Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగు కరువు కోరల్లో చిక్కుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సాగునీటి కొరతతో పంటలు ఆగమవుతున్నాయి. మొన్నటివరకు ఏటికేడు పెరిగిన సాగు ఇప్పుడు తిరోగమనం వైపు మళ్లుతున్నది. ఇందుకు ఈ ఏడాది తగ్గిన పంటల సాగు, ఎండుతున్న పైరులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిరుడితో పోల్చితే ఈ ఏడాది యాసంగిలో పంటల సాగు భారీగా తగ్గింది. ఏకంగా 10 లక్షల ఎకరాల్లో సాగు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. నిరుడు యాసంగిలో 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైతే ప్రస్తుతం ఇది 62.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది. నాలుగేండ్లుగా పెరుగుదలే తప్ప, తగ్గని యాసంగి సాగు ఇప్పుడు మళ్లీ నేలచూపులు చూస్తున్నది.
గత యాసంగి వరకు కేసీఆర్ ప్రభుత్వ సాగునీటి ప్రణాళికతో ఎర్రటి ఎండల్లోనూ కాలువల్లో నీళ్లు పారేవి. చెరువులు మత్తళ్లు దుంకేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలువల్లో చుక్క నీరు కనిపించటం లేదు. చెరువులు నిండలేదు. మత్తళ్లు దూకడం లేదు. దీంతో సాగునీటి కటకట ఏర్పడింది. సాగు నీళ్లు ఇవ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విమర్శలున్నాయి. రాజకీయ ఎజెండాతో రైతులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొంత ప్రయత్నం చేస్తే కాళేశ్వరం ద్వారా సాగు నీళ్లు అందించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా కనీస ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. తద్వారా ఆ ప్రాజెక్టు పరిధిలోని జలాశయాల్లో సాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఓవైపు కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయటంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. మరోవైపు సాగర్ ఆయకట్టుకు నీళ్లు అందించటంలోనూ విఫలమైంది.
కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక, రైతులకు మేలు చేయాలనే సంకల్పం యాసంగి కరువును తరిమేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో యాసంగిలో సాగునీటి కరువును తీర్చారు. ఫలితంగా యాసంగి సాగు వానకాలం సాగుతో పోటీ పడింది. ఈ ప్రాజెక్టును 2019 జూన్లో ప్రారంభించారు. 2019-20 యాసంగి సీజన్ నుంచి 2022-23 యాసంగి సీజన్ (గత ఏడాది) వరకు యాసంగి సాగులో భారీ పెరుగుదల నమోదైంది. రాష్ట్రం ఏర్పటైన తొలినాళ్లతో పోల్చితే గత ఏడాది యాసంగి సీజన్ వరకు పంటల సాగు విస్తీర్ణం ఏకంగా 45 లక్షల ఎకరాలు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పంటల సాగు మరింత పెరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా యాసంగిలో సాగునీళ్ల కటకట మొదలైంది. దీంతో ఈసారి యాసంగి సాగు 62.89 లక్షల ఎకరాలకే పరిమితమైంది.
రైతులను మళ్లీ యాసంగి భయం వెంటాడుతున్నట్టు కనిపిస్తున్నది. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను గుర్తు చేసుకొంటూ మళ్లీ పాత రోజులు వస్తాయేమోననే భయం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ కోతలు, ఎండిన పంటలు, నష్టాలు వీటన్నింటినీ తలుచుకుంటూ భయపడుతున్నారు. ఎండిన పంటల్లో పశువులను మేపుతున్న, కాల్చుతున్న దృశ్యాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయి.
నిరుడితో పోల్చితే ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గగా, సాగైన పంటలు కూడా చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. కాళేశ్వరంపై కక్షతో సాగునీళ్లు ఎత్తిపోయకపోవడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. సాగర్ ఆయకట్టు రైతులను నీటి ఎద్దడి నుంచి ముందే అప్రమత్తం చేయటంలో విఫలమైంది. రైతులు పంట సాగు చేసిన తర్వాత తీరిగ్గా క్రాప్ హాలిడేను ప్రకటించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 20-25 శాతం పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ, సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.