ఓ ట్రాక్టర్ కొనుక్కోవాలని, ఊర్లోనే దర్జాగా బతకాలనేది బేగరి రాజుకు పదేండ్ల నుంచి ఉన్న కల. ఆయనది కామారెడ్డి
జిల్లా నిజాంసాగర్ మండలం బండపల్లి గ్రామం. ట్రాక్టర్ కొనాలంటే ముందు లక్షనో, రెండు లక్షలో కట్టి మిగతాది ఫైనాన్స్ తీసుకోవాలి. ముందు కట్టడానికి పైసలు లేవు. ఫైనాన్స్ తీసుకున్న దానికి కిస్తీలు కట్టడం చాలా కష్టం. ఇవన్నీ ఆలోచించి ఏండ్లుగా తన కలను చంపుకుంటూ బతుకుతున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం రాజు కలను నెరవేర్చింది.
ఈ పథకం కింద మంజూరైన రూ.10 లక్షలతో ఫైనాన్స్ కిరికిరి లేకుండా రాజు సొంతంగా ట్రాక్టర్ కొనుక్కున్నడు. చేతుల ట్రాక్టర్ ఉన్నదన్న ధైర్యంతో తన మూడెకరాలతో పాటు ఇంకో 20 ఎకరాలు కౌలుకు చేస్తున్నడు. తన పొలం పని అయిపోయినంక వేరే రైతులకు కిరాయికి ట్రాక్టర్ తోలుతడు. ఇలా పోయిన సంవత్సరం ఖర్చులన్నీ పోను రూ.3 లక్షలు మిగిలినయ్. ఇది రాజు ఒక్కడి కథనే కాదు. దళితబంధు అందుకున్న ప్రతి లబ్ధిదారుడిదీ రాజు లాంటి కథనే.
ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన దళితబంధు పథకం బహుళ ప్రయోజనాలను చేకూరుస్తున్నది. దళితుల ఆర్థిక అభ్యున్నతికి అవకాశాలను కల్పించడంతోపాటు వ్యవసాయ యాంత్రీకరణను పెంచుతున్నది. వ్యవసాయ కూలీల కొరతను తీరుస్తున్నది. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి దారులు వేస్తున్నది. దళిత బంధు మొదటి విడతలో భాగంగా ఇప్పటివరకు 40,751 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. లబ్ధిదారులంతా వారి ఇష్టప్రకారం, వారికి వచ్చిన పనికి తగ్గట్టుగా యూనిట్లను కొనుగోలు చేశారు. ఇందులో అత్యధికంగా కొనుగోలు చేసినవి వ్యవసాయ యంత్ర పరికరాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినవే.
సీఎం కేసీఆర్ దార్శనికతతో రోజువారీ కూలిపనికి వెళ్లిన దళితులు ఇప్పుడు ఆధునిక యంత్రాలకు యజమానులుగా మారుతున్నారు. రెక్కల కష్టమే జీవనాధారంగా బతుకులను వెల్లదీస్తున్న దళితులకు యంత్ర పరికరాలపై హక్కులను కల్పిస్తున్నది ‘దళితబంధు’ పథకం. శ్రామికులకే యంత్ర పరికరాలపై హక్కులను కల్పించాలన్న సమసమాజ భావనలను నిజం చేస్తున్నది. దళితులకు జీవనోపాధిని చూపుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతుండడమే గాక రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి బాటలు వేస్తున్నది. యాంత్రిక పుష్టిని చేకూర్చుతున్నది. వ్యవసాయానుబంధ రంగాల వృద్ధికి ఊతమివ్వడమేగాక, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల విస్తరణకు ప్రోత్సహిస్తున్నది.
వలస కూలీలు వచ్చినా చాలట్లేదు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం తెలంగాణలో వానకాలం, యాసంగిలో కలిపి 1.31 కోట్ల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం అది 2.02 కోట్ల ఎకరాలకు చేరుకున్నది. ఇప్పుడు వ్యవసాయం పండుగలా మారింది. ట్రాక్టర్లు, వరికోత మిషన్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు ఎక్కువ మంది వీటినే కొనుగోలు చేశారు. ఇదే సమయంలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రంగా మారుతున్నది. ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులపై ఆధారపడాల్సి వస్తున్నది.
వ్యవసాయ అనుబంధ రంగాలు
అత్యధిక మందికి ఉపాధి అవకాశాలను కల్పించే వాటిలో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలదే ప్రధాన పాత్ర. కోళ్ల, గొర్రెల, చేపల పెంపకం, పాడిపరిశ్రమ, కూరగాయల సాగు తదితర రంగాలపై ఇప్పటికే ఎంతో మంది ఆధారపడి జీవనోపాధిని పొందుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ద్వారా ఈ తరహా పరిశ్రమలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా లబ్ధిదారులతో పాటు, మరికొంత మందికి ఉపాధి లభిస్తున్నది. గ్రామాల్లో దళితులు వ్యాపారవేత్తలుగా మారారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయి.
కూలీల కొరతకు పరిష్కారం
వ్యవసాయం విస్తరిస్తున్నంత వేగంగా వ్యవసాయ యాంత్రీకరణ ముందుకు సాగడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ 45 శాతానికి మించలేదు. ఇందుకు ప్రధాన కారణం పెట్టుబడి సమస్య. రెండవది చిన్న కమతాల రైతులే ఎక్కువగా ఉండడం. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకం ఆ సవాళ్లను అధిగమించేందుకు చక్కటి పరిష్కారమార్గాన్ని చూపింది. ఈ పథకం కింద దళితులు ఎంచుకుంటున్న యూనిట్లు అత్యధికంగా వ్యవసాయ యంత్ర పరికరాలే ఉంటున్నాయి. ట్రాక్టర్లు, రొటోవేటర్లు, మినీ టిల్లర్లు, వరినాటు యంత్రాలు, కోత యంత్రాలు ప్రతి గ్రామానికీ అందుబాటులోకి వస్తున్నాయి. ప్రత్యక్షంగా దళితబంధు పథకం దళితులకు జీవనోపాధిని చూపుతుండడంతో పాటు, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరింపజేయడం మరో విశేషం.
ఇప్పటి వరకు దళితబంధు ద్వారా అందజేసిన వ్యవసాయ యంత్ర పరికరాలు
కేటగిరీ : యూనిట్ల సంఖ్య
ట్రాక్టర్లు : 6,475
గూడ్స్ వాహనాలు : 4,809
హార్వెస్టర్లు : 1,402
జేసీబీ ట్రాక్టరు : 1,176
వరినాటు యంత్రాలు : 136
పెస్టిసైడ్, ఫర్టిలైజర్ యూనిట్లు : 140
డోజర్లు : 62
రొటోవేటర్స్ : 33
మినీ టిల్లర్లు : 19
పవర్వీడర్లు : 37
సాగు యంత్రాల దుకాణాలు : 23
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు
కేటగిరీ : యూనిట్ల సంఖ్య
డెయిరీ ఫామ్స్ : 3,936
పౌల్ట్రీ ఫామ్స్ : 656
గొర్రెల యూనిట్లు : 659
గోట్ రేరింగ్ : 233
సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు : 14
కూరగాయల సాగు : 27
పశువుల దాణా ఉత్పత్తి : 56
ఫిషరీస్ : 16
తేనెటీగల పెంపకం : 04
…? మ్యాకం రవికుమార్