Health Tips : చాలామందికి ఉదయం నిద్రలేవగానే మడమ నొప్పి తీవ్రంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎక్కువసేపు నిలబడటం. సరైన పాదరక్షలు ధరించకపోవడంతోపాటు అధిక బరువు ఉండటం మరో కారణం. రోజంతా మన శరీర బరువు మొత్తం మన పాదాలపై పడుతుంది. అందుకే మడమ నొప్పి కారణంగా చాలామంది ఉదయాన్నే లేవడానికి ఇబ్బంది పడతారు. మరి ముఖ్యంగా ఉదయం వేళ మనం పాదం నేలపై ఆనించిన వెంటనే మడమలో తీవ్రంగా గుచ్చుతున్నట్లుగా నొప్పి ఉంటుంది. వైద్య పరిభాషలో దీనిని ప్లాంటార్ ఫాసైటిస్ (Plantar fasciitis) అంటారు.
ప్లాంటార్ ఫాసియా అనేది మన మడమ నుంచి కాలివేళ్ళ వరకు విస్తరించి ఉండే ఒక మందపాటి కండర కణజాలం. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు మన పాదాలపై పడే ఒత్తిడిని గ్రహించడానికి అది ఒక షాక్ అబ్జార్బర్లా పని చేస్తుంది. ఈ కణజాలంపై అధిక ఒత్తిడి పడటంవల్ల స్వల్ప వాపు రావచ్చు. దీనినే ప్లాంటార్ ఫాసైటిస్ అని అంటారు. అధిక సమయం నిలబడి ఉండటం.. ఉదాహరణకు ఉపాధ్యాయులు, కూరగాయలు లేదా ఇతర వ్యాపారులు, వంట పని చేసేవారు గంటల తరబడి నిలబడి పనిచేసే మహిళలకు ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.
ఫ్లాట్ చెప్పులు లేదా హీల్స్ అతిగా వాడటంవల్ల పాదంలో అసమతుల్యత ఏర్పడి మడమపై ఒత్తిడి పెరుగుతుంది. శరీర బరువు అధికంగా ఉన్నప్పుడు, నడిచేటప్పుడు మొత్తం బరువు మడమపై పడుతుంది. దీనివల్ల ప్రధానంగా మడమ నొప్పి వస్తుంది.
ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లు నింపి డీప్ ఫ్రిజ్లో పెట్టాలి. అందులో నీరు గడ్డకట్టిన తర్వాత ఆ బాటిల్ను నేలపై ఉంచి మీ పాదాలను ముఖ్యంగా మడమలను, దానిపై ముందుకు వెనుకకు రుద్దాలి. రోజుకు 10 నుంచి 15 నిమిషాలపాటు ఇలా చేయడంవల్ల వాపు తగ్గి, నొప్పి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
ఒక తొట్టిలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల రాతి ఉప్పు లేదా ఎప్సమ్ సాల్ట్ కలపాలి. ఆ నీటిలో మీ పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఉప్పునీటిలోని మెగ్నీషియం కండరాల నొప్పిని అలసటను త్వరగా తగ్గిస్తుంది.
ఉదయం నిద్రలేచే ముందు మీ పాదాలు, కాలివేళ్ళను పైకి కిందకి సాగదీయండి. అలాగే నేలపై ఒక చిన్న టవల్ పరిచి, ఆ టవల్ను మీ కాలివేళ్ళకు దగ్గరగా లాగడానికి ప్రయత్నించండి. ఇది ప్లాంటార్ పాసియా కండరాలను బలపరుస్తుంది.
మడమ భాగంలో మృదువైన కుషన్లు ఉన్న బూట్లను మాత్రమే వాడాలి. కాళ్లకు ఏమీ లేకుంటా నేలపై ఎప్పుడూ నడవవద్దు. ఈ జాగ్రత్తలతోపాటు సూచించిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే మీకు కొన్ని రోజుల్లో మడమ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.