హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ): ‘మేము పశుపాలకులం, పరిపాలకులం.. రేవంత్రెడ్డీ ఖబడ్దార్’ అంటూ యాదవ-కురుమ సంఘాల జేఏసీ కన్వీనర్ గోసుల శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో యాదవ-కురుమ జేఏసీ నేతలు, బీఆర్ఎస్ నేత డీ రాజారాంయాదవ్తో కలిసి ఆయన మాట్లాడారు. తమ జాతిని అవమానపర్చిన రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను ఈ నెల 24 లోపు వెనక్కి తీసుకోవాలని, లేదంటే 25న గాంధీభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని తెలిపారు. ఈ నెల 16 నుంచి 21 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఎక్కడ పర్యటించినా ఆయనను పెండతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కుతూ..
రేవంత్రెడ్డికి అహంకారం తలకెక్కిందని, అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కుతూ తన నైజాన్ని ప్రదర్శిస్తున్నారని, ఆయనకు తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ నేత డీ రాజారాంయాదవ్ హెచ్చరించారు. యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మండిపడ్డారు. ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్ వ్యాఖ్యలను యాదవ జేఏసీ సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యాదవ-కురుమ సంఘాల నాయకులు లొడంగి గోవర్ధన్యాదవ్, మేకల రాములుయాదవ్, కడారి అంజయ్యయాదవ్, లాలు యాదవ్, సోమనబోయిన సుధాకర్యాదవ్, నక్క శ్రీశైలంయాదవ్, శ్రీకాంత్యాదవ్, మామిడి పద్మయాదవ్, సతీశ్యాదవ్, పరమేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.