యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 22: యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన బుధవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించేందుకు ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణ ఘట్టానికి ముందు ప్రధానాలయ వెలుపతలి ప్రాకారంలోని అద్దాల మండపంలో యాగశాల ప్రవేశం, ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, మహాకుంభారాధన, చతుస్థానార్చన నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు చేపట్టారు.
ప్రత్యేకంగా గరుడ ఆదివాసం, గరుడ హోమం నిర్వహించి పూర్ణాహుతి గావించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు అష్టదిక్పాలకులను ఆహ్వానించేందుకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించారు. స్వామివారిని పెండ్లికొడుకును చేసి 33 కోట్ల దేవతలు, 33 కోట్ల పితృదేవతలు, 33 రాగాలు, 33 తాళాలు, 33 వేదమంత్రాలతో భూలోకానికి ఆహ్వానించారు. దేవతలందరికీ స్వామివారి దివ్యవిమాన గోపురంలో వసతి సౌకర్యాలు, నైవేద్య కైంకర్యాలు అర్పించారు. లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అనుగ్రహించాలని భగవంతున్ని వేడుకుంటూ ఈ పర్వాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల మూడో రోజైన గురువారం స్వామివారి అలంకార సేవలు ప్రారంభంకానున్నాయి. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో ఎన్ గీత, డీఈవో దోర్బల భాస్కర్శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు పాల్గొన్నారు.