నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నా యి. ఆదివారం సెలవు రోజుతోపాటు కొత్త సంవత్సరం కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు, కల్యాణోత్సవాలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రాంగణం, మాడవీధులు, పుష్కరిణి ప్రాంతాలు, క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, బస్సు ప్రాంగణాలు భక్తులతో కళకళలాడాయి. పార్కింగ్ ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయి. ధర్మ దర్శనానికి 6 గంటలు, వీఐపీ దర్శనానికి 3గంటల సమ యం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 60వేల మంది దర్శించుకోగా, ఖజానాకు రూ.75,94,285 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.
వేములవాడరాజన్న ఆలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. వరంగల్లోని వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సుమారు 20 వేల మందికి పైగా భక్తులు దర్శించుకొన్నారు. మెదక్ జిల్లా ఏడుపాయల వన దుర్గాభవానీ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొన్నారు. మంజీర నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి పూజలు నిర్వహించారు.
తలనీలాలు, బోనాలు, ఒడిబి య్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండ, బీచుపల్లి, ఉమామహేశ్వరాలయం, వట్టెం, బుద్ధారంతోపాటు పలు ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని హరేకృష్ణ స్వర్ణదేవాల యం, జూబ్లీహిల్స్లోని టీటీడీకి చెందిన వేంకటేశ్వరస్వామి ఆలయం, పెద్దమ్మగుడి, సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, బిర్లామందిర్, నగర శివారులోని చిల్కూరు బాలాజీ ఆలయం, కీసరగుట్ట తదితర ప్రధాన ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు.