యాదాద్రి, నవంబర్ 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి భక్తులకు మరిన్ని ప్రసాదాలు అందుబాటులోకి రానున్నాయి. స్వామివారి లడ్డూ, పులిహోర, వడతో పాటు మరో 8 రకాల ప్రసాదాలు త్వరలో ప్రవేశపెట్టనున్నారు.
లక్ష్మీనరసింహస్వామివారికి ప్రీతికరమైన రవ్వ లడ్డూ, కదంబం, పొంగళి, చక్కెర పొంగళి, కేసరి, శిరా, కట్టె, చిల్లి గారె ప్రసాదాలను తయారు చేయనున్నట్టు ఈవో గీత తెలిపారు. వీటి తయారీ కోసం ఇప్పటికే టెండర్లను ఆహ్వానించామని చెప్పారు. త్వరలో పనులు చేపట్టి మరో నెల రోజుల్లో ట్రయల్ రన్ నిర్వహించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. యాదగిరిగుట్టతోపాటు భద్రాచలం, వేములవాడ, బాసర, కొమురవెల్లి, ధర్మపురి క్షేత్రాల్లోనూ భక్తులకు 11 రకాల ప్రసాదాలను అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.