యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో ఆదివారం వారంతపు భక్తుల రద్దీ కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి రావడంతో దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. బాలాలయంలోని ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు.
ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతును జరిపారు.
కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించారు. ఆలయం లో దర్శనం అనంతరం రూ. 100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాంటకంగా దర్శనాలు కొనసాగాయి.
సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి సహస్రనామార్చన, ఆంజనేయస్వామి వారికి జరిగిన పూజల్లో కూడా భక్తులు పాల్గొన్నారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరునికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. కొండ కింద పాత గోశాలలో గల వ్రత మండ పంలో సత్యనారాయణస్వామి వ్రత పూజలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.