యాదాద్రి: తెలంగాణ అద్భుతమైన కళా శిల్పం, ఆధ్యాత్మిక వైభవం అయిన యాదాద్రి ఆలయం పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ క్రమంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఆలయ గోపురానికి బంగారు తాపడం చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఈ ప్రకటనపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. యాదాద్రి పునఃప్రారంభం కేసీఆర్ దైవ సంకల్పానికి గొప్ప నిదర్శనమని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకు గొప్ప మహిమాన్వితమైన, పర్యాటక ప్రసిద్ధి క్షేత్రంగా విరాజిల్లే విధంగా యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం చేశారని కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇలాంటి గొప్ప దైవ సంకల్పం చారిత్రాత్మకం కావాలనే ఉద్దేశ్యంతోపునఃప్రతిష్టకు బంగారాన్ని కైంకర్యం చేస్తునట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరం కల్సి స్వర్ణ గోపుర తాపడానికి కిలో బంగారం అందజేస్తామని హరీశ్ రావు ప్రకటించారు.
ఈ గొప్ప పుణ్యకార్యక్రమానికి భాగస్వామ్యం కావడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఆ స్వామి వారి అనుగ్రహం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.