యాదాద్రి, ఫిబ్రవరి 10: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి భక్తులు విరాళాలు సమర్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బాంబినో పాస్తా ఫుడ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్వర్ణతాపడం కోసం రూ.11 లక్షల విరాళం సమర్పించింది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ ఎం సుబ్రమణ్యం గురువారం యాదాద్రిలో ఆలయ ఈవో ఎన్ గీతకు చెక్కు అందజేశారు.
దాతలకు ఉచిత దర్శనాలు : ఈవో
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాలు అందజేసే భక్తులకు ఆలయ ఈవో ఎన్ గీత గురువారం శుభవార్త తెలిపారు. విరాళాలు అందజేసేవారికి డోనర్ ఐడీ కార్డులు అందజేస్తామన్నారు. ఏడాదికి రెండుసార్లు ఉచిత దర్శనానికి అనుమతినిస్తామని చెప్పారు. రూ.5 లక్షల వరకు విరాళాలు అందజేసిన భక్తులకు స్వామివారి ఉచిత వీఐపీ దర్శనం, తీర్థ ప్రసాదం, రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు విరాళాలిచ్చిన దాతలకు వీఐపీ దర్శనంతోపాటు స్వామివారి ప్రసాదం, కండువాను అందజేస్తామన్నారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు అందజేసిన దాతలకు కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం, స్వామివారి వేద ఆశీర్వచనం, లడ్డూ ప్రసాద వితరణ, సువర్ణ పుష్పార్చన సేవలకు అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. వీటితోపాటు వారితో వచ్చే మిగతా భక్తులకు వీఐపీ టికెట్ తీసుకొని స్వామివారిని దర్శంచుకొనేందుకు అవకాశం కల్పించనున్నట్టు ఆమె వివరించారు.