హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక పరిమళాలు విరాజిల్లుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అన్ని మతాలకు చెందినవారిని తాము గౌరవిస్తామని, అది టీఆర్ఎస్ పాలసీ అని స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమ పథకాలపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమ పాలనలో ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతున్నదని చెప్పారు. ‘అందరిననమ్మకాలు, విశ్వాసాలను గౌరవిస్తం. ఇక్కడ ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. మక్కామసీదు రిపేర్ జరుగుతున్నదని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. మసీదులకు, చర్చిలకు కూడా నిధులిస్తున్నం. ధర్మపురి నుంచి మొదలుకొంటే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నాం. బోనాల పండుగను గతంలో ఏ ప్రభుత్వమైనా పట్టించుకున్నదా? ఈ పండుగకు మన మంత్రి మహమూద్ అలీ ముందుంటున్నారు. పండుగ నిర్వహణకు గతంలో రూ.2 కోట్లు, తర్వాత రూ.5 కోట్లు. ఇప్పుడు రూ.15 కోట్లు ఇస్తున్నం. పాత సచివాలయ ప్రాంగణంలో దెబ్బతిన్న గుడి, మసీదును బ్రహ్మాండంగా నిర్మిస్తాం’ అని సీఎం వివరించారు.