యాదాద్రి భువనగిరి : తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారు. నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ్మా స్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. మరి ఆలయ పునర్నిర్మాణానికి ఎన్ని నెలలు పట్టింది.. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ఎంతమంది శిల్పుల శ్రమ ఉంది. ఆలయానికి ఎన్ని టన్నుల కృష్ణశిల వాడారు? ఎంతమంది గుత్తేదారులు పని చేశారనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
2016, అక్టోబర్ 11న విజయదశమి నాడు యాదాద్రీశుడి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఆలయానికి వాడిన రాయి(కృష్ణశిల) రెండున్నర లక్షల టన్నులను గుంటూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుల నుంచి సేకరించారు. ఆలయ పునర్నిర్మాణంలో 800 మంది శిల్పులు, 8 మంది గుత్తేదారులతో పాటు 1500 మంది కార్మికుల కష్టం ఉంది. ఈ ఆలయ పునర్నిర్మాణ పనులు 66 నెలల పాటు కొనసాగాయి. ప్రధానాలయంలో 6 వేలకు పైగా శిల్పాలను శిల్పకారులు తయారు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను రూ. 2 వేల కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. యాదాద్రి ప్రధానాలయ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దేశంలోనే ప్రథమంగా ఆలయమంతా కృష్ణశిలతో నిర్మించారు. గిరి ప్రదక్షిణకు కొండ చుట్టూ 5.5 కిలోమీటర్ల మేర వలయ రహదారి నిర్మించారు.