యాదాద్రి, నవంబర్ 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం భూలోక వైకుంఠంగా కనిపిస్తున్నదని అహోబిల మఠం జీయర్ శ్రీమాన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ అన్నారు. ఒకప్పుడు యాదగిరిగుట్ట నృసింహుడి ఆలయం చిన్నదిగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఎంతో గొప్ప దేవాలయంగా పునర్నిర్మించిందని కొనియాడారు. యాదగిరిగుట్ట స్వయంభూ లక్ష్మీనారసింహుడిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక వాహనంపై కొండపైకి చేరుకున్న అహోబిల మఠం జీయర్కు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు స్వాగతం పలికారు.
తూర్పు రాజగోపురం వద్ద ఆయనకు ప్రధానార్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికింది. నేరుగా స్వయంభూ ఆలయానికి వెళ్లి పూజలు చేపట్టిన ఆయన.. మాడవీధుల్లో అనుగ్రహ భాషణం గావించారు. భక్త ప్రహ్లాదుడి కోసం తొమ్మిది అవతారాలు ఎత్తిన ఒకే ఒక్క దేవుడు నారసింహుడేనని తెలిపారు. నృసింహ పరమాత్మ స్తంభం నుంచి ఉద్భవించిందని, ఆ స్తంభం అహోబిలంలో ఉన్నదని చెప్పారు. అహోబిలంలో ఉగ్రస్తంభంలో నరసింహుడు స్వయంభువుగా ఉద్భవించారని తెలిపారు. అనంతరం మహాదేశికన్కు కమిషనర్ అనిల్కుమార్, ఈవో గీత కానుక, వస్ర్తాలు, అభిషేక లడ్డూ అందజేశారు.