యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా మహాకుంభ సంప్రోక్షణ ఘట్టాలు.. అర్చకులు, రుత్వికులు, వేదిపండితుల ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఉదయం 9:50 గంటలకు ఆలయంలో కవచమూర్తులను, ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శోభాయాత్రను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు వీవీఐపీ అతిథి గృహం నుంచి సాంప్రదాయ వస్త్రాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. 10:05 గంటలకు బాలాలయంలోని తూర్పు ద్వారం గుండా కవచములతో శోభాయాత్ర బయటకు వచ్చింది. ఈ శోభాయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు.
10:39 గంటలకు ప్రధానాలయం తూర్పుకు రాజగోపురం ద్వారా ఉత్సవమూర్తులు ఆలయంలోకి ప్రవేశించారు. 10:50 గంటలకు ముఖమండపానికి ఉత్సవమూర్తులు చేరుకున్నారు. 11 గంటలకు విమాన గోపురం, వివిధ రాజ గోపురాలపై అర్చకులు పూజలు ప్రారంభించారు. 11:40 గంటలకు ప్రధానార్చకులు మహాసంకల్పాన్ని ప్రారంభించారు.
11:55 గంటలకు దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్కు కంకణధారణ చేసి పండితులు ఆశీర్వచనం అందించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ నిర్వహించారు. రాజ గోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ నిర్వహించారు. విమాన గోపురాల శిఖరాలపై కలశ సంప్రోక్షణ కైంకర్యాలు నిర్వహించారు.