హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.108.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం రాష్ట్ర ఆర్థిక, ప్రణాళికల శాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జూన్ 22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ ప్రజలతో మాట్లాడిన సందర్భంగా జిల్లాల్లోని గ్రామాలు, మునిసిపాలిటీల అభివృద్ధికి నిధులు సమకూర్చనున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన హామీ మేరకు ఒక్కో గ్రామానికి రూ. 25 లక్షల చొప్పున జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలకు రూ.105.25 కోట్లు, మోత్కూరు, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్కోదానికి రూ.50 లక్షల చొప్పున రూ.2.50 కోట్లు, భువనగిరి మున్సిపాలిటీకి కోటి రూపాయలు కలిపి మొత్తం రూ.108.75 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.