యాదాద్రి భువనగిరి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థినులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సోమవారం ముగ్గురు విద్యార్థినులకు సైకిళ్లు బహూకరించారు. గత సంవత్సరం నవంబర్ 30న గౌస్ నగర్కు చెందిన ఎన్. స్ఫూర్తి, వి.రేవతి, పి.హారిక అనే ముగ్గురు విద్యార్థినులు గౌస్ నగర్ నుంచి బండ సోమారం జిల్లా పరిషత్ హై స్కూల్కు నడుచుకుంటూ వెళుతుండగా జిల్లా కలెక్టర్ మార్గమధ్యంలో వారిని గమనించి పలకరించారు.
మూడు కిలోమీటర్లు నడిచి వెళ్తున్న విద్యార్థినుల అవస్థచూసి సైకిల్స్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా మంజూరైన సైకిళ్లను సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆమె ముగ్గురు విద్యార్థినులకు బహూకరించారు. బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని వారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, బండ సోమారం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు విజయేందర్ రెడ్డి, తెలుగు పండిట్ బాలయ్య పాల్గొన్నారు.