యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. 2023 సంవత్సరంలో జరుపబడే ఉత్సవాలు, పండుగల తేదీలను ఖరారు చేస్తూ ఆలయ అధికారులు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు.
స్వయంభూ నారసింహుడి ప్రధానాలయం పునఃప్రారంభం అనంతరం మొదటిసారిగా జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రధానాలయానికి ఉత్తర దిశలో పంచతల రాజగోపురం నిర్మించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ చరిత్రలోనే వచ్చే ఏడాది ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనమివ్వనున్నారు. 2023 జనవరి 2న ముక్కోటి ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతోపాటు ఆరు రోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు.
జనవరి 27 నుంచి 30వరకు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు, జనవరి 31నుంచి ఫిబ్రవరి 6వరకు పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15నుంచి 20వరకు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.