యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 24 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి అలంకార సేవోత్సవంలో భాగంగా నాలుగో రోజైన శుక్రవారం నృసింహస్వామి ఉద యం వటపత్రశాయి అలంకార సేవలో, రాత్రి హంస వాహనంలో ప్రధానాలయ మాడ వీధుల్లో ఊరేగారు. ప్రధానాలయంలో వేకువజామున ద్వారతోరణ పూజ, ధ్వజకుంభారాధన, అగ్ని ఆరాధన, మూలమంత్ర, పంచసూక్త హవ నం వంటి పూజలు చేపట్టారు. ఉదయం 9 గంటలకు స్వామివారిని వంటపత్రశాయి అలంకారంలో ప్రత్యేక పల్లకీపై అధిష్ఠించి ప్రధానాలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 7 గంటలకు నారసింహుడి దివ్యమైన అలంకారంతో హంస వాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు. సాయంత్రం వైటీడీఏ ఆధ్వర్యంలో డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్టు వారితో అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో గవర్నర్ తళిమిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆలయానికి చేరుకున్న గవర్నర్కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రధానాలయంలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఆ తరువాత స్వామివారి వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం చేశారు. గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో గీత, డీఈవో దోర్బల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.