హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. శాసన సభలో బడ్జెట్లో మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు. సనాతన వైదిక ధర్మాన్ని ఆచరించడమే కాదు.. దానికి అపూర్వ వైభవం తీసుకురావాలనే గట్టి సంకల్ప కలిగిన నేత మన సీఎం అనీ, ఆయన నాయకత్వంలో ప్రభుత్వం తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేవిధంగా విశేషంగా కృషి చేస్తోందన్నారు.
పంచ నారసింహక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదాద్రి అనీ.. యాదరుషి తపస్సుకు మెచ్చి లక్ష్మీనారసింహస్వామి స్వంభువుగా వెలసిన క్షేత్రమని, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలపై వివక్ష కొనసాగిందని, దానికి యాదాద్రి అతీతం కాదన్నారు. సీఎం కేసీఆర్ ప్రముఖ వైష్ణవ ఆగమ పండితులను సంప్రదించి వారి సలహాలు, సూచనల ప్రకారం శాస్త్రీయంగా యాదాద్రి దేవాలయం నిర్మాణం శరవేగంగా జరిగిందని, సీఎం కేసీఆర్ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆలయ స్తంభాలు, మంటపాలు, గర్భగుడిని శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా ప్రముఖ స్థపతులతో ఉజ్వలంగా తీర్చిదిద్దారన్నారు.
వెయ్యి ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు ప్రజలు భక్తితో విరాళాలు సమర్పిస్తున్నారన్నారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం యాదాద్రి నరసింహ స్వామి భక్తులకు దివ్యదర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. ఇదే తరహాలో ఇతర పుణ్య క్షేత్రాలను ప్రభుత్వం చేయబోతుందన్నారు. రాష్ట్రంలో దేవాదాయశాఖకు చెందిన భూమి 2వేల ఎకరాలకుపైగా గత పాలకుల కారణంగా అన్యాక్రాంతమైందని, తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటం చేసి భూములను తిరిగి స్వాధీనం చేసుకుందని.. ఇది ఆధ్యాత్మిక ధార్మిక విషయాలపట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిదర్శనమన్నారు.