నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 11: సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల కోటేశ్వరస్వామి సన్నిధిలో వెల్గటూర్ మండల అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని గణపతి హోమం, రుద్ర హోమం, నవగ్రహ పూజ, అభిషేకం నిర్వహించారు. హనుమకొండలోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలోనూ సీఎం పేరు మీద హోమం నిర్వహించారు. మహబూబ్నగర్ రూరల్ మండలం కోడూరులోని శివాలయంలో గ్రామస్థులు పూజలు చేశారు. వరదరాజుల ఆలయంలో మహిళలు పూజలు చేశారు. వరంగల్ కాశీబుగ్గలోని శ్రీకాశీ విశ్వేశ్వరరంగనాథ స్వామి ఆలయంలో తెలంగాణ ఉద్యమకారుడు భూక్య మోతీలాల్నాయక్ శివలింగానికి పూజలు చేశారు. వరంగల్ ఏనుమాముల సుందరయ్య నగర్లోని మసీద్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని మాకుల బాలాజీ ఆలయంలో టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతి 108వ వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహరాజ్ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం, యజ్ఞం చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ హైదరాబాద్లోని యూసఫ్ షరీఫ్ దర్గాలో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్ హుస్సేన్, ప్రముఖ న్యాయవాది, వక్భ్బోర్డు సభ్యుడు మహమ్మద్ వహీద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పరిసర ప్రాంతాల్లో పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు చేయనున్నట్టు సెర్ప్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది.