కరీంనగర్ కార్పొరేషన్, మే 22: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్లో చేపట్టనున్న టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ భూమిపూజకు ముందు చేపట్టే భూకర్షణం పూజలు సోమవారం ఉదయం తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆ ధ్వర్యంలో శాస్ర్తోక్తంగా సాగాయి. సోమవారం ఉదయం ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ హోమం, కలశారాధన, అష్టదిక్పాలకుల పూజ, మండప పూజ, కన్యకాపూజ, గోపూజ, సుహాసినీ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్భాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని నవధాన్యాలను చల్లారు.
ఆ తరువాత మహా పూర్ణాహుతి, విశేష ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా హాజరు కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి అంకుర్పారణ జరిగిందని అన్నా రు. ఈ నెల 31న భూమిపూజ, అదేరోజు సాయంత్రం తిరుమల తిరుపతి అర్చకుల ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు.