హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ తొలి తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్లో సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 80కి పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొమిదేండ్లలోనే అనేక రంగాల్లో అగ్రగామిగా నిలవడం పరిపాలన, పాలకుల సమర్థతకు దర్పణమని కొనియాడారు. రాష్ట్రం దినదిన ప్రవర్థమానంగా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నదనడానికి గణాంకాలు, ప్రజాస్పందనలే నిదర్శనమని వెల్లడించారు.
ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశాలు తెలుగు వారి సమిష్టి కృషికి నిదర్శనమని, రెండు తెలుగు రాష్ట్రాల్లో సాంకేతిక వ్యాపార రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఇలాంటి మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఏపీ మంత్రి అమర్నాథ్, తెలంగాణ ఐటీ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, ప్రపంచ సమాచార సాంకేతిక మండలి అధ్యక్షుడు సందీప్ మక్తాల, అమెరికా ప్రతినిధి రవి పులి, దుబాయ్ మంత్రి అబ్దుల్లా, ఫ్రాన్స్ మంత్రులు సెబాస్టియన్, జాక్, వెస్టర్న్ యూనియన్ సీఈవో డేవిన్ మెక్ గ్రానహన్ పాల్గొన్నారు.