హైదరాబాద్, అక్టోబర్ 12: చవగ్గా లభించే పౌష్టికాహారంలో గుడ్డుది మొదటి ప్లేస్. దీనిని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారాన్ని ‘వరల్డ్ ఎగ్ డే’గా జరుపుకుంటారు. సమతుల ఆహారంలో గుడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. గుడ్డుతో రకరకాల వంటలను చిటికెటలో చేసుకునే వీలుండడంతో చాలామందికి ఇది బ్రేక్ఫాస్ట్గా మారిపోయింది. గుడ్ల ఉత్పత్తిలో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడోస్థానంలో ఉంది. మన దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వినియోగంలో మాత్రం తెలంగాణది అగ్రస్థానం. జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి ప్రతి ఒక్కరు సగటున 181 గుడ్లు తినాలి. ఈ విషయంలో జాతీయ సగటు 95గా ఉంది.
కోడిగుడ్డులోని ప్రొటీన్ అందించడమే కాకుండా కంటిచూపును మెరుగుపరుస్తుంది. శుక్లాలను నివారిస్తుంది. చూపు మందగించకుండా జింక్, సెలీనియం, విటమిన్-ఈ తోడ్పడతాయి. విటమిన్-డీ లోపంతో బాధపడేవారు రోజుకో గుడ్డుతో దాని నుంచి బయటపడొచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భిణులు తింటే కాల్షియం పొందొచ్చు. ఒక్క గుడ్డు తినడం ద్వారా మరెన్నో పోషకాలను పొందొచ్చు.
గుడ్డులోని పచ్చసొన విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి పచ్చసొనతో బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పచ్చసొన పిల్లలు, గర్భిణులకు ఆరోగ్యకరం. అందులో కొంత కొవ్వు ఉన్నప్పటికీ అది గుండెకు మేలుచేసేదే. మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఆస్టియోపొరోసిస్ను దూరంగా ఉండేందుకు సాయపడుతుంది. గుడ్డుపై ఉన్న అపోహలను పక్కనపెట్టి రోజుకో గుడ్డు తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరు నెలల శిశువు నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒకరూ గుడ్డు తినొచ్చు. ఇది జీర్ణం కావడానికి కొంత ఎకువ సమయం పడుతుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారు మాత్రం వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.