Food Crises | హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకొస్తున్నదా? బియ్యం ఉత్పత్తి పడిపోయిందా? ధరలపై తీవ్ర ప్రభావం పడుతుందా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. పలు సర్వేలూ ఇదే రుజువు చేస్తున్నాయి. మనదేశంలోనూ ఇవే పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలుండగా, తెలంగాణలో మాత్రం ప్రభుత్వ అనుకూల విధానాలతో బియ్యం ఉత్పత్తి భారీగా పెరగనున్నది. ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పిత్తి 20 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయినట్టు ఫిచ్ సొల్యూషన్ తన సర్వేలో వెల్లడించింది.
2003 తర్వాత బియ్యం ఉత్పత్తిలో ఇదే అతిపెద్ద సంక్షోభమని పేర్కొన్నది. అప్పుడు 18.6 మిలియన్ టన్నుల కొరత ఉండగా, ప్రస్తుతం 8.7 మిలియన్ టన్నుల కొరతకు దారితీసిందని తెలిపింది. చైనా, పాకిస్థాన్ వంటి వరి ప్రధాన దేశాల్లో కరువు, ప్రతికూల వాతావరణం కారణంగా బియ్యం ఉత్పత్తి భారీగా పడిపోయినట్టు తెలిపింది. వీటితో పాటు అమెరికా, యూరప్లోనూ ఉత్పత్తి పడిపోయినట్టు పేర్కొన్నది. ఉక్రెయిన్ యుద్ధం కూడా బియ్యం ఉత్పత్తి పడిపోవడానికి ఒక కారణంగా తేల్చింది. పాకిస్థాన్లో అకాల వర్షాలు, వరదల కారణంగా 31 శాతం ఉత్పత్తి తగ్గినట్టు తెలిపింది. చైనాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలో గత 20 ఏండ్లలో ఎప్పుడూ లేనంత కరువు ఏర్పడినట్టు తెలిపింది. దీంతో ఆయా దేశాల్లో వరి సాగు తగ్గి బియ్యం ఉత్పత్తి పడిపోయినట్టు వెల్లడించింది.
బియ్యం ధరలపై ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తి పడిపోవడంతో ధరలపై ప్రభావం చూపుతుందని ఫిచ్ సొల్యూషన్ సర్వే నివేదిక పేర్కొన్నది. బియ్యం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 కోట్ల మంది పేదలపై ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వచ్చే ఏడాది ఇది సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.
వచ్చే సీజన్లో మనదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోనూ వరి, గోధుమ ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదికలో వెల్లడైంది. కానీ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిన తెలంగాణలో మాత్రం భిన్నంగా ఉన్నది. ఈ ఏడాది వరిసాగు పెరగడంతో బియ్యం కొరతను అధిగమించనున్నది. నిరుడు 98 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ ఏడు ఏకంగా 1.21 కోట్ల ఎకరాల్లో సాగైంది. ఈ ఒక్క ఏడాదిలోనే 23 లక్షల ఎకరాల్లో వరిసాగు పెరగడం గమనార్హం. దీనికి తగ్గట్టుగానే ధాన్యం ఉత్పత్తి పెరగనున్నది. వ్యవసాయం అనుకూలతతో సీఎం కేసీఆర్ ముందుచూపు ఆలోచనలతో రాష్ట్రం సంక్షోభం నుంచి బయటపడనున్నదని తేలింది. రాష్ట్రం లోని సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయరంగాన్ని సుభిక్షంగా మార్చా యి. ఇప్పుడు దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా మారింది.