జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యువ చైతన్య యూత్ ఆటో యూనియన్, కామారెడ్డి గూడెంలో హమాలీ సంఘం, పాలకుర్తిలో సీఐటీయూ అధ్వర్యంలో మేడే జెండాలను మంత్రి ఆవిష్కరించారు.
ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి గత ఏడాదిలో 176.91 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చిందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు 184.07 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరింది.
కార్మిక శాఖలోని కార్యకలాపాలను ప్రభుత్వం పూర్తిగా ఆన్లైన్ చేసిందన్నారు. దీని ద్వారా కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభిస్తుందన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు వల్ల అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో తమ కంపెనీలను పెడుతున్నాయని మంత్రి తెలిపారు.