హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని అధ్యాపకులకు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీజేఎల్ఏ) -475 ఆవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దుష్టశక్తులు అడ్డుపడినప్పటికీ సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన బాధ్యత క్రమబద్ధీకరించిన ఉద్యోగులపై ఉన్నదని పేర్కొన్నారు. మాజీ చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కొంతమంది అధ్యాపకుల క్రమబద్ధీకరణకు తన వంతుగా కృషిచేస్తానని చెప్పారు. సమావేశంలో టీజీవో ఇంటర్ విద్యా ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు, టిప్స్ రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణాగౌడ్, సంఘం నేతలు వీ శ్రీనివాస్, సురేశ్, జగన్నాథం, ఎన్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్రెడ్డి, శోభన్బాబు, శంకర్, సంగీత, తదితరులు పాల్గొన్నారు.