కొత్త జిల్లాల్లో కొత్త పోస్టుల మంజూరు
శాఖల్లో తగ్గనున్న ఉద్యోగుల పనిభారం
హైదరాబాద్, మార్చి 9 : కొత్త జిల్లాలకు పోస్టుల మంజూరులో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించింది. జనాభా దామాషా ప్రకారం పోస్టులను మంజూరుచేసింది. ఇలా రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, పాఠశాల విద్యాశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో కొత్త పోస్టులను మంజూరు చేసినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రెవెన్యూలో 3,560 పోస్టులను భర్తీ చేయనుండగా.. వీటిలో అత్యధికం జనాభా దామాషా ప్రకారం కేటాయించినవే. వివిధశాఖల్లోనూ ఇదే తరహాలో కొత్త పోస్టులను మంజూరుచేసినట్టు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పనిభారాన్ని ఎదుర్కొంటున్నారు. దీనిని సరిచేయాలని భావించిన సర్కారు.. కొత్త పోస్టులను మంజూరుచేసింది. ములుగు జిల్లా భౌగోళికంగా పెద్ద జిల్లా. కానీ జనాభా తక్కువ. వరంగల్ జిల్లా భౌగోళిక విస్తీర్ణం తక్కువ. కానీ జనాభా ఎక్కువ. జిల్లాలన్నింటికీ సమానంగా పోస్టులు మంజూరుచేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశముండటంతో జనాభాను పరిగణనలోకి తీసుకొని పోస్టులను కేటాయించారు. ఇదే విధానాన్ని మండలాలకు సైతం వర్తింపజేశారు. దీనివల్ల పరిపాలనలో ఇబ్బందులు తలెత్తవని, ప్రజలకు సేవలు సక్రమంగా, సకాలంలో అందుతాయని భావిస్తున్నారు.