హైదరాబాద్, సెప్టెంబర్ 14: రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్య శాశ్వత పరిష్కారంతో పాటు అటవీ సంపద సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
పోడు వ్యవసాయం చేసుకుంటున్న పోడు వ్యవసాయదారులకు సమస్యలపై శాశ్వత పరిష్కారంతో పాటు భవిష్యత్తులో అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా చేపట్టే సంరక్షణ చర్యలపై బుధవారం అరణ్య భవన్ లో జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా మంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
జిల్లా, మండలం, గ్రామపంచాయతీ స్థాయిలో కమిటీ ఏర్పాటు, కమిటీల బాధ్యత క్షేత్రస్థాయిలో పోడు భూముల పరిశీలన, అడవులను సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో మంత్రి చర్చించారు.
అడవులను రక్షించడానికి, అటవీ సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించి భవిష్యత్లో అటవీ భూమి ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు పలు సూచనలు చేశారు. పోడు సమస్య జిల్లా స్థాయిలో పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, వనరులను ఉపయోగించుకోవడం, తదితర అంశాల గురించి మంత్రి వివరించి సందేహాలను నివృత్తి చేశారు.
రాజకీయాల కతీతంగా, పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం కేసీఆర్ లక్ష్యాలక అనుగుణంగా పని చేయాలన్నారు.
సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఫ్ ఆర్.ఎం.డొబ్రియల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోణప్ప, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, దివాకర్ రావు, ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, పీసీసీఎఫ్ (ప్రొడక్షన్) ఎం.సీ పర్గెయిన్, తదితరులు పాల్గొన్నారు.