హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఆరోపించారు. పోక్సో కేసు దర్యాప్తు విషయంలో జరుగుతున్న తాత్సారంపై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో కండ్లకు గంతలు కట్టుకొని యువకులు నిరసన వ్యక్తంచేశారు.
అనంతరం ధర్మేంద్ర మాట్లాడుతూ.. ఈ కేసు విషయంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపాలని, బాధితురాలి హక్కులను కాపాడేలా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి కేసుల విషయంలో అధికార పార్టీలకు వరకు వచ్చేసరికి చట్టం నత్తనడకన నడవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. న్యాయస్థానం చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూ, బాధితురాలికి భద్రత, న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు.