హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: దవాఖానకు వచ్చేవారికి వైద్య సేవలందించాల్సిన సిబ్బంది మద్యం తాగి చిందులేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్)లో ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగినులు, బయటివారితో కలిసి పుట్టినరోజు వేడుకల పేరిట కార్యాలయంలోనే పార్టీ చేసుకొన్నారు. బీర్లు తాగి డ్యాన్స్లు చేశారు. వీరిని దవాఖానకు వచ్చిన వారి బంధువులు వీడియో తీసినట్టు తెలుస్తున్నది. వారంరోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో హాట్టాపిక్గా మారింది. దవాఖానలో మద్యం సేవించి చిందులేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విచారణ చేపట్టి చర్యలు.. ఆరోగ్యశ్రీ విభాగంలో సేవలందిస్తున్న ఇద్దరు మహిళలు, బయటివారితో కలిసి దవాఖానలో మద్యం సేవించినట్టు తమ దృష్టికి వచ్చిందని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ విజయలక్ష్మి తెలిపారు. అప్పుడే వారిని తీవ్రంగా మందలించినట్టు చెప్పారు. తాజాగా వీడియో వైరల్ కావడంతో విచారణకు ప్రత్యేక కమిటీ వేశామన్నారు. నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.