స్వరాష్ట్రంలో ఆడబిడ్డలను అందలమెక్కించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మహిళా సాధికారతకు, స్వయంశక్తికి, ఆత్మగౌరవానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆడబిడ్డల పేరు మీదే ప్రారంభించారు.
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కుటుంబ వ్యవస్థలో ఇంటి ఆడబిడ్డకు ఉన్న గౌరవం కుటుంబంలో ఇతరులెవ్వరికీ ఉండదు. ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి అరిష్టం అనే నానుడి కూడా ఉన్నది. రాష్ట్రప్రభుత్వం కూడా అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నది. రాష్ట్రంలో ఆడబిడ్డను అందలం ఎక్కించింది. దాదాపు అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో శ్రేయస్సు మహిళాన్విత తేజమై విరాజిల్లుతున్నది. కల్యాణలక్ష్మి అయినా.. ఆసరా పెన్షన్ అయినా, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అయినా, ఆరోగ్యలక్ష్మి అయినా, దళితబంధు వంటి విప్లవాత్మక పథకమైనా, దేశానికి మార్గనిర్దేశం చేసిన షీ-టీమ్స్ అయినా, భరోసా కేంద్రాలైనా, ఆడబిడ్డల కష్టసుఖాల్లో భాగస్వామి అయిన సఖి కేంద్రాలైనా అన్నీ ఆడబిడ్డకు అండగా నిలబడేవే. అంతేకాదు సమ్మక్క-సారలమ్మ బ్యారేజ్, లక్ష్మి, సరస్వతి పంప్హౌజ్లు, ప్రభుత్వం ఉచితంగా నిర్మించి ఇచ్చే డబుల్బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులు.. ఇలా ఎక్కడ చూసినా మహిళలకు ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నదో తెలుస్తుంది. మహిళా సాధికారతకు, స్వయంశక్తికి, ఆత్మగౌరవానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని వర్గాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వాటి పరిణామాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు
బతుకమ్మ చీరలు: ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల చీరలను పంపిణీ చేసింది. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించటంతోపాటు ఇంటి ఆడబిడ్డకు చీర పెట్టే సంస్కృతిని ప్రభుత్వం ప్రారంభించింది.
అంగన్వాడీ హెల్ప్లైన్ 155209
అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం హెల్ప్ లైన్ (నంబర్ 155209)ను ప్రారంభించింది. దీని కింద అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహార పంపిణీ, ఇతర సేవల్లో అంతరాయాలు, అంతరాలు ఉంటే హైదరాబాద్ మహిళా కమిషనరేట్ కార్యాలయం నుంచే నేరుగా అవసరమైన చర్యలు తీసుకొనేందుకు వీలు కలుగుతున్నది.
గణనీయంగా తగ్గిన మాతృ మరణాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్మి, బాలామృతం, బాలామృతం ప్లస్ వంటి వినూత్న పథకాల వల్ల మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయి. 2014లో మాతృ మరణాల రేటు లక్షకు 92 ఉంటే, 2022 నాటికి 56కు తగ్గాయి. మాతృ మరణాల రేటు జాతీయ సగటు 103.
కల్యాణలక్ష్మి
పేదింటి ఆడబిడ్డల పెండ్లి ఖర్చులకోసం ప్రారంభించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మరో సంచలనం. ఈ పథకాల కింద ఒక్కో యువతి పెండ్లికి రూ.లక్షా 116 అందజేస్తున్నది. ఇప్పటివరకు 11,62,917 మందికి రూ.10 వేల కోట్లు అందజేసింది.
దవాఖానలో ప్రసవాలు
అమ్మఒడి వాహనాలను అందుబాటులోకి తేవడం, గర్భిణులను క్రమం తప్పకుండా దవాఖానలకు తరలించటం, కేసీఆర్ కిట్ పథకం వంటి అనేక విప్లవాత్మక చర్యల వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. అన్నిరకాల దవాఖానల్లో కలిపి ప్రసవాలు 2014లో 91 శాతం ఉండగా, 2022లో 97 శాతానికి పెరిగాయి. ఇది దేశ సగటు (79) కంటే 18 శాతం అధికం. ఇదే కాలంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 63 శాతానికి పెరిగాయి.
అంగన్వాడీ, ఆశ వర్కర్ల గౌరవ వేతనం పెంపు
దేశంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు అత్యధికంగా గౌరవ వేతనం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. అంగన్వాడీ టీచర్కు నెలకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్/హెల్పర్స్కు రూ.7,800 గౌరవ వేతనంగా అందిస్తున్నది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్కు 67,411 పోచంపల్లి చేనేత చీరలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆశ వర్కర్ల గౌరవ వేతనం రూ.4 వేలు ఉండగా, రూ.9,750కి పెంచింది.
మహిళా రిజర్వేషన్ల పెంపు
మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కింది. జనరల్ స్థానాల్లో కూడా మున్సిపల్ చైర్పర్సన్లుగా, నగరపాలక సంస్థలకు మేయర్లుగా అవకాశం కల్పించింది. పారిశ్రామిక రంగంలోనూ మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.
కేసీఆర్ కిట్
మాతా శిశు సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తో రాష్ట్రంలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటి దాకా 12.66 లక్షల మందికి రూ.1,525 కోట్లు విలువైన కిట్లు అందజేసింది.
ఉమెన్ హెల్ప్లైన్ 181
మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని గ్రహించిన ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకోసం హెల్ప్డెస్క్ 181ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్డెస్క్ 24/7 పనిచేస్తుంది. ఇప్పటివరకు ఈ డెస్క్కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి 47,150 మందిపై కేసులు నమోదు చేసింది.
సఖి కేంద్రాలు: రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వన్స్టాప్ సెంటర్/ సఖి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ కారణాల వల్ల బాధితులైన మహిళలను ఆదుకోవటానికి మానవీయ స్పర్శతో ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాధిత మహిళలకు అవసరమైన వైద్య సేవలు, కౌన్సెలింగ్ (సైకో-సోషల్), న్యాయ సహాయంతోపాటు తాత్కాలిక వసతిని ప్రభుత్వం కల్పిస్తున్నది. ఇలా ఇప్పటివరకు 44,809 మందికి సఖి కేంద్రాలు అండగా నిలిచాయి.
22.35 లక్షల మందికి ఆరోగ్యలక్ష్మి
తల్లీబిడ్డలు, గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1, 2015న ‘ఆరోగ్యలక్ష్మి’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 35,700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంపూర్ణ పౌష్టికాహారం అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో తల్లీబిడ్డలు, గర్భిణుల కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.6 ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తానికి అదనంగా రూ. 22 ఖర్చుచేస్తున్నది. ఈ పథకాన్ని 11 రాష్ర్టాల ప్రతినిధుల బృందాలు అధ్యయనం చేశాయి.
– ఆరోగ్యలక్ష్మి పథకం కింద లబ్ధిదారులు (బాలింతలు, గర్భిణులు)