Free Bus For Women | కొల్చారం, డిసెంబర్ 17: ‘ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని పిల్లాపాపలతో అమ్మవారి దర్శనానికి వచ్చాం. కానీ ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సులు నడపడంలో విఫలమయ్యారు’ అని పలువురు మహిళలు, ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు. ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆదివారం మహిళా భక్తులు పిల్లాపాపలతో కలిసి వచ్చారు.
తిరుగు ప్రయాణంలో ఏడుపాయల నుంచి కొల్చారం మండలం పోతంశెట్పల్లి శివారులోని మెదక్-హైదరాబాద్ జాతీయరహదారి వద్దకు చేరుకుని బస్సు కోసం వేచిచూశారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రోడ్డు గుండా ఒక్క ఆర్టీసీ బస్సు రాలేదు. దీంతో వందలాది మంది భక్తులు అసహనం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయింది. అంతలో అటుగా వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఆపినప్పటికీ అది నిండుగా ఉంది. చేసేదిలేక మహిళా భక్తులు.. బస్సు డ్రైవర్ ఫోన్ నుంచి మెదక్ డీఎం సుధకు కాల్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. స్పందించిన డీఎం రెండు బస్సులు పంపడంతో ప్రయాణికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.