Telangana | ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. ఈ ఆర్యోక్తిని ఉటంకించే వారే తప్ప ఆచరించిన వారు చరిత్రలో కనిపించరు. వనిత భువిపై నడయాడే దేవత, మహిళ మహిలో మహిమాన్విత, మగువలు మమతలకు మణిదీపాలు, బుద్ధి కుశలతలో విశారదులు. స్త్రీ లేకపోతే జననం లేదు. గమనం లేదు, జీవం లేదు, ఆఖరికి ఈ సృష్టే లేదు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించటం అసాధ్యమని మనసా వాచా కర్మణా నమ్మే వారిలో సీఎం కేసీఆర్ అందరికన్నా ముందున్నారు. తొమ్మిదేండ్ల పాలనలో అన్నింటా ఆడబిడ్డలకే అగ్రాసనం వేశారు. దాదాపు ప్రతి పథకం రూపకల్పన, అమలు మహిళాభ్యున్నతే లక్ష్యంగా, సాధికారతే ధ్యేయంగా, వారి సంక్షేమమే పరమావధిగా కేసీఆర్ పాలన సాగుతున్నది. విద్య, వైద్య, ఆర్థిక, సామాజిక, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ మహిళా రాజ్యంగా వెలుగొందుతున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ‘నమస్తే తెలంగాణ’ కథనం..
బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, భూమ్మీదకు రాగానే కేసీఆర్ కిట్, ఆడపిల్లను కంటే నగదు ప్రోత్సాహకం, బిడ్డ ఎదుగుతున్న సమయంలో ఆరోగ్య లక్ష్మి, పెళ్లీడుకొస్తే కళ్యాణలక్ష్మి, విధి వంచిస్తే వితంతు పింఛన్, ఒంటరి మహిళకు పింఛన్, బీడీ కార్మికులకు పింఛన్, ఆలనాపాలనా లేని ముసలమ్మలకు ఆసరా పింఛన్.. ఇలా పుట్టబోయే బిడ్డ మొదలు పండు ముసలమ్మల దాకా ప్రతి దశలో ఆడకూతురికి అండగా నిలుస్తున్నది కేసీఆర్ సర్కార్. స్త్రీ విద్యకు పెద్దపీట వేస్తూ గురుకులాలు, మహిళా కాలేజీల ఏర్పాటుతో అబ్బాయిలకన్నా మెరుగైన ఫలితాలు అమ్మాయిలు సాధిస్తున్నారు.
అగ్రికల్చర్ డిగ్రీ కాలేజీలు, వొకేషనల్ కాలేజీలు, ఎక్స్లెన్సీ సెంటర్లు, ఆర్మ్డ్ ఫోర్సెస్ కాలేజీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ ఇవన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినవే. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం వల్లే తరాలుగా అణిచివేతకు గురవుతున్న మహిళకు అండగా నిలిచి విద్యా,ఉపాధి కల్పిస్తున్నారు. షీటీమ్స్ తో ఆడకూతురికి అడుగడుగునా భద్రత కల్పించారు. మహిళలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు. స్థానిక సంస్థలు మొదలు కార్పొరేషన్ మేయర్ల దాకా, శాసనసభతోసహా తెలంగాణ రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించారు. ఆకాశంలోనే కాదు అవకాశాల్లోనూ మహిళ సగభాగం అని చాటిచెప్తున్నారు.
కేసీఆర్ చేపట్టిన విప్లవాత్మకమైన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గిపోయాయి. మాతా శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ పాలనలో మహిళ అన్ని రంగాల్లో ప్రగతిపథంలో సాగుతున్నది. విద్యా,వైద్య, ఆర్థిక, సామాజిక, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మహిళల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ మహిళా రాజ్యంగా వెలుగొందుతున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఏ శుభకార్యం నిర్వహించినా ఇంటికి ఆడబిడ్డను పిలుచుకొని, కొత్త బట్టలు పెట్టి దీవెనార్తులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయం. ఆ ఆనవాయితీని తెలంగాణ సర్కారు ప్రతి కార్యక్రమంలోనూ కొనసాగిస్తున్నది. దశాబ్దాలుగా లింగ వివక్షతకు, విస్మరణకు గురవుతున్న మహిళలకు తెలంగాణ సర్కారు ఆలంబనగా నిలుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నది. విద్యా, వైద్యం, ఉపాధి రంగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తూ మహిళల స్థితిగతులను పెంచేందుకు నిర్మాణాత్మక, గుణాత్మక చర్యలకు శ్రీకారం చుడుతున్నది. సాధికారత పదాన్ని ఆచరణలో చూపుతూ యావత్ దేశానికే నేడు ఆదర్శంగా నిలుస్తున్నది.
మహిళల సర్వతోముఖాభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అవి మహిళలే ఇరుసుగా రూపొందించినవిగా ఉండడం విశేషం. పుట్టింది మొదలు పైండ్లె, సంతానం కలిగేంత వరకూ తెలంగాణ సర్కారు ఆడబిడ్డకు తోడుగా నిలబడుతున్నది. పోషకాహారలోపం, రక్తహీనతను తగ్గించడంపై ప్రత్యేక దృష్టిని సారించింది. రాష్ట్రంలో ఆడబిడ్డల వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు, ఉపాధిశిక్షణ కేంద్రాల ఏర్పాటు ఇలా అనేక పథకాలు మహిళల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా స్కీములన్నీ అనేక అద్భుతాలను సృష్టిస్తున్నాయి. మహిళల భద్రతకు కూడా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలను తీసుకొంటున్నది. షీ టీంలను ఏర్పాటు చేసి ఈవ్టీజింగ్కు పాల్పడే తుంటరి మూకల ఆట కట్టిస్తున్నది. గృహహింసకు గురవుతున్న వారికి సఖి సెంటర్ల ద్వారా పునరావాసం కల్పిస్తూ న్యాయపరమైన హక్కులను కాపాడటంలో ముందుంటున్నది.
బాలికల విద్య
తెలంగాణ ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తున్నది. బాలికల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను సైతం నెలకొల్పింది. పౌష్టికాహారం అందిస్తూ కార్పొరేట్కు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. గురుకులాల్లో కొన్నింటిని బాలికల కోసమే ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా ఏర్పాటు చేసి.. ఐఐటీ, జేఈఈ, నీట్తోపాటు జాతీయ, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో తర్ఫీదునిస్తున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ గురుకుల విద్యార్థినులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందిన ఉన్నత విద్యాసంస్థల్లోనూ బాలికలు అడ్మిషన్లు పొందుతుండటం ప్రభుత్వ కృషికి నిదర్శనంగా నిలుస్తున్నది. అలాగే, డిగ్రీ మొదటి సంవత్సరం నుంచే పై చదువులకు అనుగుణంగా వివిధ పోటీపరీక్షలకు సంబంధించి విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు డాటా సైన్స్, జావా తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్, న్యూమరికల్, మెంటల్ ఎబిలిటీ, స్పోకెన్ ఇంగ్లిష్పై తరగతులు నిర్వహిస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూలు, క్విజ్ పోటీలను నిర్వహిస్తూ విద్యార్థినులను మెరికలుగా తీర్చిదిద్దుతున్నారు.
వీ హబ్ ద్వారా 321 మందికి ఉపాధి అవకాశాల కల్పన
స్టార్టప్లకు మద్దతు : 276
స్టార్టప్ ఇంక్యుబేషన్ : 148
స్టార్టప్ ప్రోగ్రామ్స్ : 12
మహిళా ఆంత్రప్రెన్యూర్లు : 3,427
దాతల ద్వారా మహిళలకు సమకూర్చిన నిధులు 32.6 కోట్లు
ఉపాధి కల్పనకు చేయూత
గురుకులాల్లో బాలికలకు విద్యతోపాటు స్వశక్తితో ఎదిగేందుకు వీలుగా ఎంబ్రాయిడరీ, అల్లికలు తదితర వృత్తుల్లో శిక్షణ ఇస్తున్నది. సాధారణ గురుకులాలతోపాటు గురుకుల వృత్తి విద్యా కళాశాలలు, డిప్లొమా కోర్సులు, ఆర్మ్డ్ ఫోర్స్, న్యాయకళాశాల, అగ్రికల్చర్, మహిళా యూనివర్సిటీ, తదితర ప్రత్యేక గురుకులాలను సైతం నెలకొల్పింది. డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థినులకు వేసవి సెలవుల్లోనూ ఉచితంగా శిక్షణ ఇస్తూ ఉన్నత భవితకు బాటలు పరుస్తున్నారు. గురుకులాల ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్స్ను నిర్వహిస్తూ ఉపాధి అవకాశాలను సైతం కల్పిస్తున్నారు. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతులకు ఉచితశిక్షణ అందిస్తున్నారు. ఓవర్సీస్ పథకంలో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ విదేశాల్లో విద్యాభ్యాసానికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నారు.
రాజకీయ అవకాశాల్లో సగభాగం
గతంలో డబ్బులు, పలుకుబడి ఉంటే తప్ప మహిళలకు రాజకీయంగా అవకాశాలు లభించేవి కాదు. కానీ అందుకు భిన్నంగా స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు మొదలు పంచాయతీలు, మున్సిపాల్టీల్లోనూ సగం స్థానాలను కేటాయించింది. గతంలో ఎన్నడూ ఏ పార్టీ ఇవ్వని విధంగా ఇటీవల హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం మహిళకు కేటాయించడం మహిళలు పొందుతున్న రాజకీయ అవకాశాలకు నిదర్శనం. జీహెచ్ఎంసీ మొదలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పీఠాలను సైతం మహిళలకే ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఆర్థిక సాధికారత
తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థికసాధికారతకు సైతం పెద్దపీట వేస్తున్నది. తెలంగాణలో ఆడబిడ్డలకు ఉన్నతస్థానాన్ని కల్పిస్తున్నది. రేషన్ కార్డు, డబుల్ బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్, దళితబంధు చెక్కులు.. ఇలా ప్రభుత్వం అమలు చేసే ఏ పథకమైనా ఆడబిడ్డ పేరిటనే అందిస్తున్నది. ఏఎన్ఎంలు, అంగన్వాడీల వేతనాలను రెట్టింపు చేయగా, వారు నేడు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.
ఇతర పథకాలతోనూ పరోక్ష లబ్ధి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక విప్లవాత్మక పథకాలు, పాలనా విధానాల్లో తీసుకొస్తున్న సంస్కరణలన్నీ మహిళల అభ్యున్నతికి పరోక్షంగా దోహదపడుతున్నాయి. మహిళల సామాజిక జీవన ప్రమాణాలను పెంచడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. మిషన్ భగీరథ పథకంతో ఇంటికే క్రమం తప్పకుండా నల్లా నీళ్లు వస్తుండటంతో ఆడబిడ్డ గడపదాటే అవసరం లేకుండా పోయింది. ఇంటాయన ఆకాలమరణంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్న ఆడబిడ్డలకు రైతుబీమా, చేనేతబీమా, గీత, భవననిర్మాణ కార్మిక బీమా పథకాల ద్వారా అందిస్తున్న ఆర్థికసాయం కొండంత అండగా నిలుస్తున్నది.
వ్యవసాయభూముల పేరు మార్పు, ఆస్తుల బదలాయింపు ప్రక్రియను నిమిషాల్లోనే ధరణి పోర్టల్ ద్వారా పూర్తి చేస్తుండటంతో ఆడబిడ్డలకు ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన గోస తీరింది. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీళ్లురాగా పల్లెలు పచ్చబడ్డాయి. దీంతో చేతినిండా పని లభించి గ్రామీణ ఆడబిడ్డల ఆదాయం పెరిగింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, బస్తీ దవాఖానాలు, కంటివెలుగు తదితర పథకాలతో అత్యధికంగా ఊరట పొందుతున్నది మహిళలే. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ప్రత్యక్షంగా, పరోక్షంగా మహిళల అభ్యున్నతికి దోహపడుతుండటం విశేషం.
ఉపాధి, ఉద్యోగావకాశాలు..
9 ఏండ్లలో మహిళా ప్రగతి..
రాజకీయ రంగం
స్థానిక సంస్థలు – 50% రిజర్వేషన్
నామినేటెడ్ పోస్టులు – 50% రిజర్వేషన్
తెలంగాణ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్య – 67,486 మంది (50.07శాతం)