రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో యువతుల సంచలనం
విద్యార్థుల్లో 50 శాతానికి పైగా అమ్మాయిలే
ప్రతి విద్యా ప్రాంగణంలో మహిళలదే హవా
పీజీ కోర్సుల్లో గణనీయంగా పెరుతున్న వాటా
ప్రభుత్వ చేయూతతో ఉన్నత చదువులవైపు చూపు
గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్,
కల్యాణలక్ష్మితో తగ్గిపోయిన బాల్య వివాహాలు
తోడ్పాటునిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అమ్మాయిలు నూతన చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాల్లో సగభాగానికి పైగా అందిపుచ్చుకొంటున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ విద్యాసంస్థకు వెళ్లి చూసినా.. ఆశ్చర్యకర మార్పు కనిపిస్తున్నది. ప్రతి విద్యాలయ ప్రాంగణంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తున్నారు. అమ్మాయిల తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అండదండలు.. ప్రోత్సాహం.. మహిళా విద్యను కొత్తపుంతలు తొక్కిస్తున్నాయి. తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ విద్యాసంస్థ అమ్మాయిలకు బంగారు భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నది.
హైదరాబాద్, మార్చి 29 : రాష్ట్రంలో ఇప్పుడు ఆడపిల్ల బరువు కాదు.. బంగారం. వంటింటి కుందేలు కాదు.. విజ్ఞాన కాంతుల గని. అందుకు తార్కాణమే యూనివర్సిటీ విద్యలో కొనసాగుతున్న మహిళల హవా. రాష్ట్రంలోని ఏ యూనివర్సిటీలో చూసినా అమ్మాయిలదే ఆధిపత్యం. ప్రతిష్ఠాత్మక ఉస్మానియాలో 58 శాతం అమ్మాయిలు ఉంటే, కాకతీయలో 61 శాతం చదువుతున్నారు. 2021 -22 విద్యాసంవత్సరంలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల వివరాలను పరిశీలిస్తే అన్ని యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. గతంలో అమ్మాయిలు పాఠశాల విద్య దాటడమే గగనంగా ఉండేది. ఇంటర్ పూర్తిచేస్తే చాలు అన్నట్టుగా పరిస్థితులుండేవి. ఈ పరిస్థితి కొంతకాలంగా మారుతున్నది. పుట్టుక నుంచే బాలికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో అడ్డంకులను అధిగమించి ముందడుగేస్తున్నారు. అమ్మాయిల పట్ల తల్లిదండ్రుల వైఖరిలోనూ మార్పు వస్తున్నది. ప్రత్యేక గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్, మెరిట్ స్కాలర్షిప్స్ వంటి చర్యలతో అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల అమలుతో బాల్యవివాహాలు తగ్గి ఉన్నత విద్యలో అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నది.
ఈ గణాంకాలే నిదర్శనం
భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే దిశగా..
నేను శాతవాహన వర్సిటీలో ఎంఏ అర్థశాస్త్రం మూడో సెమిస్టర్ చదువుతున్నా. మన రాష్ట్రంలోని వర్సిటీల్లో 60 నుంచి 70 శాతం వరకు అమ్మాయిలు చేరడం సంతోషం. దీనిని బట్టి స్త్రీ, పురుష లింగ భేదం లేకుండా మహిళలు ఉన్నత విద్యలో రాణిస్తున్నట్టు అవగతమవుతున్నది. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే దిశగా విశ్వవిద్యాలయాల్లో అడుగులు పడుతున్నాయి. ఆడ పిల్లల నిష్పత్తి పెంచడమే కాకుండా చదువుకొనేందుకు వసతులు కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. – డీ సౌజన్య, ఎంఏ, శాతవాహన వర్సిటీ
హాస్టల్ వసతి, ఫీజు రీయింబర్స్మెంట్తో భరోసా
చదువు పట్ల అంతటా అవగాహన పెరిగింది. తల్లిదండ్రులు మారుతున్నారు. కుటుంబ మద్దతుతోనే అంతా రాణిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం భరోసానిస్తున్నది. పైసా ఫీజు లేకుండా చదువుకొంటున్నాం. హాస్టళ్లలో మంచి ఆహారం అందిస్తున్నారు. యూనివర్సిటీల్లో వాతావరణం సైతం మారింది. ఇంతకు ముందులా సమస్యలు లేవు. వీటన్నింటితో ధైర్యంగా ముందడుగేస్తున్నాం.
– తనూజ, ఎంఈడీ, ఓయూ
ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే..
రాష్ట్ర సర్కారు ఉన్నత విద్యను పటిష్ఠంచేసి, యూనివర్సిటీలను బలోపేతం చేస్తుండటంతో అమ్మాయిల నమోదు క్రమంగా పెరుగుతున్నది. సైన్స్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉన్నది. జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలన్న తపనతో అమ్మాయిలు సైన్స్ కోర్సుల్లో అధికంగా చేరుతున్నారు. డిగ్రీలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అడ్మిషన్లు పొందగా, పీజీకి వచ్చేసరికి పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్నారు. ఫార్మా కోర్సులో శాతవాహన వర్సిటీలో 150 మంది అబ్బాయిలుంటే, అమ్మాయిలు 350 మంది ఉన్నారు. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
జాతీయ సంస్థల్లోనూ ..
స్వరాష్ట్రంలో విద్యా వసతుల కల్పన పెరిగింది. ముఖ్యంగా గురుకులాల ఏర్పాటుతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ గురుకులాల ఏర్పాటుతో బాలికల డ్రాపౌట్ రేట్ తగ్గింది. నాణ్యమైన విద్య లభిస్తుండటంతో ఉన్నత చదువులకు వచ్చేవారికి సంఖ్య పెరుగుతున్నది. మన వర్సిటీలకే పరిమితం కాకుండా ఐఐటీలు, ఢిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నారు. రాబోవు రోజుల్లో అమ్మాయిల నమోదు మరింత పెరగనున్నది. – ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్, శాతవాహన వర్సిటీ వీసీ