గట్టు, ఏప్రిల్ 15 : ‘ఈ ఊరి స్థలం మాది.. వదిలి వెళ్లండి.. దీనికి పట్టాదారులం మేము’ అంటూ ఓ ముగ్గురు వ్యక్తులు జేసీబీతో ఏకంగా ఓ గ్రామంలోని ఇండ్లనే కూల్చడానికి ప్రయత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చమన్ఖాన్దొడ్డిలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం ప్రకారం.. చమన్ఖాన్దొడ్డిలోని 129 సర్వే నంబర్లో 11.14 ఎకరాల పొలం ఉన్నది. ఇది పట్టాపొలమని, ఇది గ్రామం అంచునే ఉన్నదని ఖాసీంసాబ్, నబీసాబ్, మదర్సాబ్ వాదిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తున్నది. ఇదే స్థలంలో 300 దాకా ఇండ్ల నిర్మాణాలు ఉన్నాయి. వీటితోపాటు వాల్మీకి కమ్యూనిటీ హాల్, కనకదాసు విగ్రహం, తాగునీటి ట్యాంకుల నిర్మాణాలు ఉన్నాయి. ఈ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కూడా జరిగింది. ఈ వ్యవహారంపై ఇంతకుముందు గొడవ కూడా జరిగింది.
ఈ క్రమంలో ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించారు. ఇండ్ల నిర్మాణం చేసుకుని మూడు తరాల నుంచి ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఊరి స్థలం తమదంటూ వస్తే ఎలా సహిస్తామని స్థానికులు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి పట్టాదారులమంటూ వచ్చే వీరి ముఖాలు తమతోపాటు తమ వాళ్లు కూడా చూసి ఉండరని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. ఇదిలావుండగా 129 సర్వే నంబర్లో ఉన్న ఇండ్లను కూల్చాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నట్టు చెప్తున్నారు. ఈ విషయమై ఎస్సై శేఖర్గౌడ్ను వివరణ కోరగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నదని, దీనిపై ఏమి మాట్లాడలేనని పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.