జడ్చర్ల : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు తాగు నీటి కోసం మహిళలు బిందెలతో మైళ్ల దూరం ప్రయాణించిచాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా భగీరథ నీళ్లు రాకపోవడంతో మహబూబ్నగర్ జిల్లాలో మహిళలు నిరసన చేపట్టారు.
పది రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో జడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట పాత బజార్ మహిళలు ధర్నాకు దిగారు. తమ కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వెంటనే తాగునీటి సరఫరా చేయాలని మహిళలు నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి నీటి ట్యాంకర్ ను పంపిస్తామని.. ఆ తర్వాత తాగునీటి సరఫరా చేస్తమని హామీ ఇవ్వటంతో మహిళలు ధర్నా ను విరమించి అక్కడి నుంచి ఇండ్లకు వెళ్ళిపోయారు.