SHE Teems | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆకతాయిల ఆటకట్టించేందుకు మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించేందుకు కేసీఆర్ హయాంలో పోలీసు శాఖ తీసుకొచ్చిన ‘ఉమెన్ సేఫ్టీ వింగ్’ సత్ఫలితాన్నిస్తున్నది. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ విభాగం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆడవారికి ఏదైనా ఆపదొస్తే ‘షీటీమ్స్’ గుర్తుకొచ్చేలా వ్యవస్థ ఏర్పాటైంది. బస్టాప్లు, రైల్వేస్టేషన్లు, థియేటర్లు, జాతరలు, పండుగలు ఏవైనా సరే మఫ్టీల్లో మహిళా పోలీసులు విధులు నిర్వర్తించి పోకిరీల ఆటకట్టించారు. ఈ ఏడాది ఉమెన్ సేఫ్టీ వింగ్లోని షీటీమ్స్ విభాగానికి 10,766 ఫిర్యాదులు అందగా.. తీవ్రతను బట్టి 850 కేసులు నమోదు చేశారు. మహిళల భద్రత, ఇతర అంశాలపై 2,146 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ వింగ్లోనే ఉన్న ‘భరోసా’ విభాగం బాధితులను అక్కున చేర్చుకొని సాంత్వన కలిగిస్తున్నారు. ఈ ఏడాది భరోసా కేంద్రాల ద్వారా 52 మందికి శిక్షలు విధించారు. ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ (ఐటీటీఎస్వో) ద్వారా అత్యాచార కేసుల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. పని ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురికాకుండా ‘సాహస్’ అనే (మాడ్యూల్) తీసుకొచ్చారు. ఆయా కంపెనీల యజమానులు, పోలీసుల సమక్షంలో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేశారు. 38 ప్రాంతాల్లో వేధింపుల నివారణపై శిక్షణ ఇచ్చారు.
సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలని గత ప్రభుత్వం ‘సైబర్ అంబాసిడర్ ప్లాట్ఫాం’ (సీఏపీ)ని తీసుకొచ్చింది. ఎన్నారై మహిళల నుంచి ఇప్పటివరకు 400 ఫిర్యాదులు స్వీకరించి 104 కేసులను పరిష్కరిం చింది. ట్రాన్స్జెండర్ల కోసం ‘ప్రైడ్ ప్లేస్ సెల్’ ఏర్పా టు చేసి ఈ ఏడాది 13 కేసుల్లో వారిని వేధిస్తున్న పోకిరీల భరతం పట్టారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఉమెన్ సేఫ్టీ వింగ్లోని ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్’ (ఏహెచ్టీ) మాడ్యూల్ తీవ్రంగా శ్రమిస్తున్నది. ఈ ఏడాది 287 హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు కాగా.. వాటిల్లో 557 మంది బాధితులను రక్షించారు. కాగా 364 మంది ట్రాఫికర్స్ను అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆపరేషన్ స్మైల్ ద్వారా 2,955 మంది, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,617 మంది చిన్నారులను రక్షించారు.