చిల్పూరు, మార్చి 21 : ‘కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన మీరు అధికార దాహంతో కాంగ్రెస్లో చేరారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీల గురించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలేదు.. కేవలం మొక్కల పెంపకంపై మాట్లాడడమేంటి..’ అని మహిళలు నిలదీశారు. శనివారం జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన నిర్వహించి, కడియం శ్రీహరి కటౌట్కు వినతిపత్రం అందించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు కేశిరెడ్డి రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ టికెట్పై స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి అవకాశవాదంతో కాంగ్రెస్లో చేరారని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లవుతున్నా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. వీటిపై కాలయాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిని నిలదీయాల్సిన కడియం శ్రీహరి మొకల గురించి అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు నెలకు రూ. 2,500, వృద్ధాప్య పింఛన్ను రూ. 4,000కు పెంపు, కల్యాణలక్ష్మి పథకంలో నగదుతోపాటు తులం బంగారం, విద్యార్థినులకు సూటీ తదితర హామీలు ఎక్కడికిపోయాయని ప్రశ్నించారు.
రైతుభరోసా, వంట గ్యాస్ సబ్సిడీలు అమలు కావడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి ఉండగా సాధారణ విషయాలపై అసెంబ్లీలో మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మల్కాపూర్ను మండ ల కేంద్రంగా చేస్తామని చెప్పిన హామీ మరిచిపోయారా అని శ్రీహరిని ప్రశ్నించారు.