అందోల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalaxmi scheme)పై మహిళల(Women) నుంచే వ్యతిరేకత వ్యక్త మవుతున్నది. బస్సుల్లో మహిళలందరికి ఉచిత ప్రయాణమని( Free bus) చెప్పిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడం లేదని, ఆర్టీసీ సిబ్బంది నుంచి తమకు సరైన గౌరవం లభించడంలేదని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా అందోల్(Andol) నియోజకవర్గంలో గల 161 వ జాతీయ రహదారిపై నుంచి జోగిపేట – సంగారెడ్డి – హైదరాబాద్ వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నారాయణఖేడ్ డిపో నుంచి హైదరాబాద్ వరకు అరగంటకు వచ్చే బస్సులు ఇప్పుడు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న బస్సులు రాకపోవడంతో మహాలక్ష్మి పథకంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మహిళామణులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని నమ్మి ఓటు వేసిన తమనే గంటల తరబడి రోడ్లమీద నిలబెడుతున్నారని మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఉచిత బస్సు సౌకర్యంతో తమకు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు గౌరవం ఇవ్వడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లాదుర్గం స్టేజీలో కొందరు డ్రైవర్లు బస్సులు కూడా ఆపడం లేదని, ఇలాగైతే తాము గమ్యస్థానాలకు చేరేది ఎప్పుడు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మహిళలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పందించాలంటూ మహిళలు కోరుతున్నారు.