తొర్రూరు : మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తుందని
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీ నిధి సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాలకుర్తి నియోజకవర్గంలో రూ.5.10 కోట్లతో పైలట్ ప్రాజెక్టు కింద తొర్రూరు మండలం, మున్సిపాలిటీ, పెద్ద వంగర మండలాల మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణా నిర్వహిస్తున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ వచ్చాక మహిళలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. గతంలో మహిళలు కుండలు పట్టుకుని నీళ్ల కోసం గంటల తరబడి నిలబడే వారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకు రూ. 40 వేల కోట్లు ఖర్చుతో మిషన్ భగీరథను ఇంటింటికీ తీసుకువచ్చి నల్లాల ద్వారా మంచి నీరు అందిస్తున్నామన్నారు. గతంలో డ్వాక్రా సంఘాలకు రూ. 4 వేల కోట్ల రుణాలు ఇవ్వగా బీఆర్ఎస్ హయాంలో రూ. 18వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని వెల్లడించారు.
మహిళల్లో చైతన్యం వచ్చింది. ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. మహిళల అభివృద్ధితోనే దేశం ప్రగతి చెందుతుంది.మహిళలు మంచి మదుపరులు.చిల్లి గవ్వ ను కూడా వృథా చేయరని ’ మంత్రి పేర్కొన్నారు.డబ్బును సద్వినియోగం చేయడంలో మహిళల తర్వాతే ఎవరైనా అని ప్రశంసించారు.శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయడం పథమ కర్తవ్యమని తెలిపారు.గ్రామంలో ప్రతి వస్తువు మహిళా సంఘాలే తయారు చేసే స్థాయికి ఎదగాలని సూచించారు.
స్త్రీ నిధి కింద మహిళలు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇస్తున్నామని,దురదృష్టవశాత్తూ చనిపోతే రుణం మాఫీ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. మహిళలకు శిక్షణ నిరంతర ప్రక్రియని వెల్లడించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. కేంద్రం విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని చూస్తుందని దీని సీఎం అడ్డుకుంటూ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులను ఆదుకుంటున్నారని స్పష్టం చేశారు. కలెక్టర్ శశాంక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.