హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువులను మొదట అమెజాన్ సహేళిలో అందుబాటులో ఉంచారు. దీనిలో ఇప్పడిప్పుడే కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 100 రకాల ఉత్పత్తులను అమ్మకానికి ఉంచాలని నిర్ణయించారు. ఇలా మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి డిమాండ్ ఏర్పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మహిళలు తయారు చేసే వస్తువులకు ప్రోత్సాహకం లభించి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సర్కారు అంచనా.