ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో శనివారం మహిళాబంధు సంబురాలు నిర్వహించారు. 130 అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వ పథకాలపై వేసిన రంగవల్లులు ఆకట్టుకొన్నాయి. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదింటి దీపాలు అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు.
-సత్తుపల్లి
జగతిని సృష్టిస్తాం.. వ్యవస్థను పునర్నిర్మిస్తాం.. అమ్మలా అడవిని కాచుకుంటాం.. అవసరమైతే పోకిరీల తాట తీస్తాం.. మత్తు ఎత్తులను చిత్తు చేస్తాం.. సురక్షిత ప్రయాణానికి ‘రైట్రైట్’ చెప్తాం.. పనేదైనా సత్తా నిరూపిస్తాం.. ఇదీ నేటి మహిళా లోకం దమ్ము. అవకాశమిస్తే ఆకాశమే హద్దుగా అద్భుతాలు చేయగలమని నిరూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహించింది. దీంతో వివిధ విభాగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేడు ఏ డిపార్ట్మెంట్లో చూసినా మహిళా అధికారులు, ఉద్యోగులు కీలకంగా మారారు. ఎంతటి కఠిన పరిస్థితుల్లోనైనా వెనుకడుగు వేయక సమర్థంగా పనిచేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ఉద్యోగుల విజయాలపై ప్రత్యేక కథనం..
– (నాగోజు సత్యనారాయణ) హైదరాబాద్, నమస్తే తెలంగాణ
మహిళలు ఉద్యోగం చేయటంపట్ల సమాజంలో కొంతకాలం వరకు తీవ్ర వివక్ష, వ్యతిరేకత కనిపించేది. కుటుంబసభ్యులే అడ్డుకొనేవారు. కానీ ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది. ఉద్యోగాల కోసం ప్రిపేరవ్వాలని తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తలే మహిళలను ప్రోత్సహిస్తున్నారు. కోచింగ్లకు పంపుతున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇండ్లల్లో అవసరమైన సాయం చేస్తున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు తమ శక్తియుక్తులన్నీ ఉద్యోగ నిర్వహణలో ఉపయోగించే అవకాశం కలుగుతున్నది. ఒకప్పుడు పురుషులకే సొంతం అన్నట్టు ఉన్న యూనిఫాం విభాగాల్లో కూడా నేడు మహిళలు గణనీయంగా పెరిగారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపితే నేరుగా ట్రెజరీ నుంచి వేతనాలు పొందుతున్న మహిళా ఉద్యోగులు 94,384 మంది ఉన్నారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు వంటివాటిని కలుపుకొంటే రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు లక్షన్నర మంది ఉంటారు.
పోలీస్ విభాగంతోపాటు ఇతర యూనిఫాం ఉద్యోగాలు పురుషులే చేయగలరన్న అపోహలు క్రమంగా తొలగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖాకీ దుస్తుల్లో కనిపించే మహిళల సంఖ్య ఎన్నోరెట్లు పెరిగింది. కానిస్టేబుల్, ఎస్సై తదితర ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించటంతో వేల మంది మహిళలు పోలీస్ ఉద్యోగాల్లో చేరారు. పెట్రోలింగ్ మొదలు నేర పరిశోధన వరకు ఏ పనిలోనైనా సత్తా చాటుతున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) వంటి సాయుధ బలగాల్లోనూ మహిళల సంఖ్య పెరుగుతున్నది. అడిషనల్ డీజీ నుంచి కానిస్టేబుల్ వరకు అన్ని ర్యాంకులలోనూ మహిళలు ఠీవిగా ఉద్యోగం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వివిధ ర్యాంకులు కలిపి 4,846 మంది మహిళా సిబ్బంది నిత్యం ప్రజారక్షణలో పాలుపంచుకొంటున్నారు. రవాణాశాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య గతంలో నామమాత్రమే. మూడేండ్లపాటు హెవీ లైసెన్స్ ఉండాలన్న నిబంధనతో మహిళల నుంచి దరఖాస్తులే వచ్చేవి కావు. 2012 తర్వాత కోర్టు తీర్పులతో మార్పు వచ్చింది. ప్రస్తుతం వందమంది వరకు రవాణాశాఖ మహిళా అధికారులు, సిబ్బంది నిత్యం వాహనాల తనిఖీలు సహా ఇతర క్షేత్రస్థాయి విధుల్లో పాలుపంచుకొంటున్నారు. ఆర్టీసీలో వివిధ హోదాల్లో మొత్తం 4,842 మంది మహిళలు ఉన్నారు. వారిలో నాలుగువేల మంది మహిళా కండక్టర్లే. నిత్యం రద్దీగా ఉండే సిటీ బస్సుల్లోనూ ఎంతో చాకచక్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆబ్కారీశాఖలోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ఇందులో అన్ని క్యాడర్లలో కలిపి 465 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన అటవీశాఖలో కూడా అతివలు అద్భుతంగా రాణిస్తున్నారు. 20 ఏండ్ల కిత్రం అటవీశాఖలో మహిళా ఉద్యోగులు 3 శాతమే. తెలంగాణ రాష్ట్ర వచ్చేనాటికి కూడా 13 శాతమే ఉన్నారు. కానీ ప్రస్తుతం అటవీశాఖలోని మొత్తం ఉద్యోగుల్లో 30.58 మంది మహిళలే ఉన్నారు. ప్రతి పదిమంది ఫారెస్ట్ బీట్ అధికారుల్లో నలుగురు మహిళలే ఉండటం గమనార్హం. బీట్ అధికారుల్లో 40 శాతం మంది బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ పట్టభద్రులు ఉన్నారు.
మహిళలకు పోలీస్శాఖలో రిస్క్తోపాటు గౌరవం ఉంటుంది. తోటి అధికారులతో పోలిస్తే ప్రెట్రోలింగ్, కోర్టు డ్యూటీలు తదితర అన్నిపనుల్లోనూ ముందుకు వెళ్తున్నాం. ప్రత్యేకించి మా ఆఫీసర్ల ప్రోత్సాహం బాగుంటున్నది. డిపార్ట్మెంట్లో మహిళల సంఖ్య పెరుగుతున్నది. ఒక పోలీస్గా ఎంతో మందికి సహాయం చేసే అవకాశం వస్తున్నది. మహిళా అధికారి ఉంటే బాధిత మహిళలు ధైర్యంగా మా దగ్గరికి వచ్చి సమస్యలు చెప్పుకొంటారు. వాటికి సరైన పరిష్కారం చూపే వీలుంటుంది.
– సుజాత, ఎస్సై, సుల్తాన్ బజార్
డ్యూటీపరంగా చాలా రకాల ఒత్తిళ్లు ఉంటాయి. కానీ మేం మగవారితో సమానంగా పోటీ పడి పనిచేస్తాం. మహిళలు అన్న సాకు ఎప్పుడు చెప్పింది లేదు. తెల్లవారుజామున అయినా, అర్ధరాత్రి అయినా డ్యూటీలో వెనక్కి తగ్గేదే లేదు. డిపార్ట్మెంట్లో అధికారులు ఎంతో ప్రోత్సాహం, గౌరవం ఇస్తారు. ఎక్సైజ్శాఖలో ప్రస్తుతం ప్రతి స్టేషన్లోనూ కనీసం ఒక ఉమెన్ కానిస్టేబుల్ అయినా ఉన్నారు. ఎస్హెచ్ఓలుగా బాగా రాణిస్తున్నారు. 1998లో నేను పీజీ చదువుతున్నప్పుడే పెండ్లి అయ్యింది. నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ప్రోత్సాహంతో గ్రూప్స్కి ప్రిపేరయ్యాను. 2009లో ఎక్సైజ్ ఎస్సైగా జాబ్ సాధించాను. డ్యూటీలో నా కుటుంబ సహకారం, ముఖ్యంగా నా భర్త, పిల్లల ప్రోత్సాహం ఎంతో ఉంటుంది.
– కల్పన, సీఐ, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్
అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా మూడేండ్లు పనిచేశాను. ఆ తర్వాత సివిల్స్కు ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యాను. 2017లో రేంజ్ ఆఫీసర్గా అటవీశాఖలో చేరాను. అటవీశాఖలో ఉద్యోగం నిత్యం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి అడవి నుంచి పెద్దపుల్లి బెల్లంపల్లి పట్టణంలోకి వచ్చింది. అంతా భయాందోళనలో ఉన్నారు. సిబ్బందితోపాటు ఎంతో కష్టపడి పులిని సురక్షితంగా అడవిలోకి మళ్లించగలిగాం. ప్రస్తుతం పనిచేసే భూపాలపల్లిలో ప్రధానంగా పోడుభూముల సమస్య ఉన్నది. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నాం.
– భూక్యా లావణ్య, డీఎఫ్వో, భూపాలపల్లి
చిన్నప్పటి నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి ఆవేశం వచ్చేది. ఇప్పుడు ఒక ఎస్సైగా సమస్యలు పరిష్కరించాక బాధితుల కండ్లలో సంతోషం చూస్తే ఎంతో తృప్తి కలుగుతుంది. పిల్లలు పట్టించుకోవడంలేదని ఓ వృద్ధురాలు నా దగ్గరికి వచ్చారు. వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చాను. ఇప్పుడు ఆమె సంతోషంగా ఉన్నది. మరో మహిళకు వారి కుటుంబం అండగా ఉండేలా చేయగలిగాం. ఇలాంటివి వృత్తిగతంగా ఎంతో సంతృప్తి ఇస్తున్నాయి. నేను పోలీస్ అధికారి కావటానికి కారణం నా భర్తే. 2009లో పీజీ చదువుతున్నప్పుడే నాకు పెండ్లి అయ్యింది. నా భర్త సునీల్ ప్రోత్సాహంతోనే 12 ఏండ్ల తర్వాత కూడా 2020లో నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధించా. వాస్తవానికి ఆయన పోలీస్ కావాలనుకున్నా, కొన్ని కారణాలతో కాలేకపోయారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రోత్సహించడంతో ఆయన కలను నిజం చేశా.
– పీ రాధిక, ఎస్సై, వెంకటాపురం, ములుగు జిల్లా
ఇష్టపడి పనిచేస్తే ఏ ఉద్యోగంలో అయినా అలసట ఉండదు. నిరంతరం ఒత్తిడి ఉండే పోలీస్ ఉద్యోగంలో కూడా సంతోషంగా పనిచేయగలుగుతున్నాం. సమస్యలతో వచ్చేవారికి సాయం చేస్తే ఎంతో తృప్తి ఉంటుంది. ప్రత్యేకించి మహిళలు వారి సమస్యలన్నీ మాతో చెప్పుకోగలరు. ఒక మహిళగా మేం ఆ సమస్యను అర్థం చేసుకొని పరిష్కరించగలుగుతాం. నేను కౌన్సెలింగ్ ఇచ్చిన ఓ జంట ఇప్పుడు సంతోషంగా కలిసి ఉంటున్నారు. వారి ప్రతి పెండ్లిరోజు నాకు ఫోన్ చేస్తుంటారు. నా వరకైతే డ్యూటీని ఎంతో ఎంజాయ్ చేస్తాను. మా పై అధికారులు ఎంతగానో ప్రోత్సాహిస్తున్నారు.
– జీ రమాదేవి, ఏఎస్సై, నల్లకుంట
గతంతో పోలిస్తే రవాణాశాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతున్నది. 2012లో నేను సర్వీస్లో చేరినప్పుడు మా బ్యాచ్లో 26 మంది మాత్రమే మహిళా అధికారులం. మా రోజువారీ విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఫీల్డ్లో ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు రాత్రుళ్లు, తెల్లవారుజామున కూడా డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. కొంత ఒత్తిడి ఉన్నా కుటుంబ సభ్యుల సహకారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. వర్కింగ్ ఉమెన్కు ఫ్యామిలీ సపోర్ట్ అత్యంత ముఖ్యం. నా విధుల్లో నా భర్త సహకారం 99 శాతం ఉంటుంది.
-రాధిక, మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్, అత్తాపూర్
వరంగల్ జిల్లా నర్సంపేటలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక మహిళలతో కబడ్డీ ఆడుతున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
ప్రజాసేవలో ఉండటం ఎంతో సంతోషం. యూనిఫాం సర్వీస్లో ఉంటూ నిత్యం ప్రజలకు సేవ చేయాలన్నది నా లక్ష్యం. అందుకే ఎనిమిదేండ్లపాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా తృప్తి చెందలేదు. బ్రిటన్లో పనిచేసినా సంతృప్తి కలుగలేదు. భారత్కు తిరిగి వచ్చి ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేశాను. 2016లో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాను. డ్యూటీ ఛాలెంజింగ్గానే ఉంటుంది. నాకు కుటుంబం ఎంతో అండగా ఉంటున్నది. ప్రత్యేకించి మా అత్తగారు, నా భర్త సహకారంతోనే ముందుకు వెళ్తున్నా. మా ఉన్నతాధికారుల సహకారం సైతం మరువలేనిది.
– శ్రీలత, అసిస్టెంట్ ఎంవీఐ, గద్వాల.
మహిళలు ఫీల్డ్జాబ్స్ చేయలేరన్న అపోహ ఉంటుంది. కానీ ఇష్టంతో చేస్తే ఏ పనిలోనూ కష్టం ఉండదు. ఎక్సైజ్శాఖలో మహిళా ఉద్యోగిగా పనిచేస్తున్నా, మేం ఎప్పుడూ ఎవరికీ తక్కువ అని అనుకోను. ఫీల్డ్కి వెళ్లినప్పుడు ఉమెన్ ఆఫీసరా అని చూస్తారు. మన పనితనం చూశాక ఆ తేడా చూపరు. కొన్నిసార్లు అర్ధరాత్రి కూడా వెళ్లాల్సి వస్తుంది. కానీ, మా అధికారులు, కుటుంబ సహకారం ఉంటుంది. కుటుంబ సహకారం వృత్తిగతంగా మన విజయంలో అత్యంత కీలకం. గతానికి భిన్నంగా మహిళలు అన్ని రకాల ఉద్యోగాల్లోనూ సేవలందిస్తున్నారు. ఎక్సైజ్లో కూడా మహిళల సంఖ్య చాలా పెరిగింది. మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. పురుషులతో సమానంగా పనిచేయవచ్చు.
– పీ వీణారెడ్డి, ఎక్సైజ్ ఎస్హెచ్వో, మహేశ్వరం
ఇష్టంగా చేస్తే ఏ పని అయినా కష్టం అనిపించదు. నేను 22 ఏండ్లుగా కండక్టర్గా పనిచేస్తున్నా. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బస్సుల్లో వర్కింగ్ ఉమెన్, విద్యార్థినుల సంఖ్య ఎంతో పెరిగింది. మాకు అది ఎంతో సంతోషాన్నిచ్చే అంశం. మా డ్యూటీ పీక్ అవర్స్లో కొంత కష్టమే. అయినా కుటుంబ అవసరాల కోసం తప్పదు. కుటుంబానికి మనవంతు సహకారం ఉందన్న సంతృప్తి ఉంటుంది.
-అమ్ములు, కండక్టర్, రాణిగంజ్-1 డిపో
నేను 2012 నుంచి కండక్టర్గా పనిచేస్తున్నా. రోజూ ఎంతో రద్దీలో పనిచేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఏవైనా పొరపాట్లు ఉన్నా మేమే సర్ధుకుపోతాం. ప్రయాణికులకు సేవచేసేందుకే మేం ఉన్నామని భావిస్తాను. డ్యూటీలో ఎంత ఇబ్బంది ఉన్నా కుటుంబ సహకారంతో అన్నీ తట్టుకోగలుగుతున్నాం. ముఖ్యంగా నా భర్త, అత్త ఎంతో ప్రోత్సహిస్తారు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. వారి బాధ్యత అత్తమ్మే చూసుకుంటున్నది. కుటుంబం తోడుంటే ఎంత కష్టసాధ్యమైన పనిలో అయినా మహిళలు విజయం సాధిస్తారు.
-బాలమణి, కండక్టర్, హకీంపేట డిపో