హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమం, భద్రతకు పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా కమిషన్ నూతన కార్యాలయాన్ని నగరంలోని బుద్ధ భవన్లో మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మధన్రెడ్డి, కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, సభ్యులు, శాఖ అధికారులతో కలిసి మంత్రి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. చైర్ పర్సన్ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా కమిషన్ కార్యాలయాన్ని అభిమాన నాయకులు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరికీ అందుబాటులో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుండి ఆమె పెళ్లి చేసే వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలబడుతోందన్నారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, సఖి కేంద్రాలను నిర్వహిస్తూ, నేడు మహిళా కమిషన్ వారికి అండగా నిలబడేందుకు ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఇంతగా పాటు పడుతున్న ఈ ప్రభుత్వాన్ని మహిళలు అందరూ మనస్పూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.