Neelam Madhu | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ‘నాకైతే చెంప పగలగొట్టాలని అనిపించింది’ అని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై ఆ పార్టీ నాయకుడి భార్య ఒకరు తన అరచేతి చూపిస్తూ మంత్రి కొండా సురేఖ సమక్షంలోనే ఆగ్రహంతో ఊగిపోయారు. ఊహించని పరిణామానికి మంత్రి సురేఖకు ఏం చెప్పాలో అర్థంగాక ‘ఉంటదిలే ఆ మాత్రం ఆవేదన’ అంటూ ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న సురేఖ అక్కడ జరిగింది మీడియా చిత్రీకరిస్తుందేమోనని అనుమానం వచ్చి ‘రికార్డు’ చేయకండని కోరారు. అసలేం ఏమి జరిగిందంటే.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి నియామకం అయ్యాక తొలిసారి మంత్రి కొండా సురేఖ గురువారం ఆ నియోజకవర్గానికి వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నుంచి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, కాటా శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నీలం మధు.. నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్గౌడ్ను కాదని కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస్గౌడ్కు కాకుండా మధును పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల సీడబ్ల్యూసీ సభ్యుడు, ప్రస్తుత మంత్రి దామోదర రాజనరసింహ తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీనివాస్గౌడ్కు టికెట్ ఇవ్వకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని రాజనరసింహ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. చివరి నిమిషంలో మధుకు కాకుండా కాంగ్రెస్ బీ-ఫామ్ను శ్రీనివాస్గౌడ్ ఇచ్చింది. నీలం మధు అప్పటికప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య జరిగిన త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిన నీలం మధును కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన శ్రీనివాస్గౌడ్ మద్దతు కోసం మంత్రి సురేఖను వెంటబెట్టుకొని మధు గురువారం వారి ఇంటికి వెళ్లారు. అక్కడ శ్రీనివాస్గౌడ్ భార్య సుధారాణి స్పందిస్తూ.. ‘నా భర్తను (శ్రీనివాస్గౌడ్) అనే రైట్ ఎవరికీ లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు (నీలం మధును చూపిస్తూ). మీ మీద రెస్పెక్ట్తో, ఇప్పుడు చెప్తున్న.. (అరచేతి చూపిస్తూ) నాకైతే చెంప పగులగొట్టాలనిపించింది. కొంచమైనా కామన్సెన్స్ ఉండాలి లీడర్ అన్నాక.. కనీస ఎథిక్స్ ఉండాలి.’ అంటూ ఆమె కోపంతో ఊగిపోయారు. దీనికి మధు స్పందిస్తూ, ‘చిన్న మిస్టెక్ జరిగింది’ అనగా, ‘నువ్వు మాట్లాడొద్దు’ అంటూ సుధారాణి చేయి చూపిస్తూ వారించారు. ఈ ఆసక్తికర సన్నివేశం సోషల్మీడియాలో వైరల్గా మారింది.