హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళ సాటి మహిళ అని చూడాకుండా ఓ యువతిపై అనుమానంతో పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దిగజారి ప్రవర్తించింది. యువకులతో యువతిని కిడ్నాప్ చేయించింది. అంతే కాకుండా యువకులతో సదరు యువతిపై అత్యాచార యత్నం చేయింది. ఆపై యువతి నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీసి అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండాపూర్ శ్రీరాంనగర్ లో భర్తతో కలిసి ఓ మహిళ నివాసం ఉంటోంది.
అదే కాలనీలో ఉండే యువతితో మహిళ భర్తకు పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటుండే వారు. ఇది చూసిన ఆ మహిళ ఇద్దరిపై అనుమానం పెంచుకొని.. పైశాచిక కుట్రకు పథకం వేసింది. ఈ నెల 26న మాట్లాడాలి రమ్మంటూ యువతిని శ్రీరాంనగర్లోని తన ఇంటికి పిలిచి.. ఇంట్లోని బాత్రూంలో బంధించింది. ఆ తర్వాత యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నలుగురు యువకులను పిలిపించి వారితో యువతిపై దాడి చేయించింది.
ఆ నలుగురు యువతిపై అత్యాచారయత్నం చేయడంతో పాటు పైశాచికంగా హింసించారు. యువతి ప్రైవేట్ భాగాలపై దాడి చేశారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ ఫోన్లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించింది. తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, సదరు మహిళతో పాటు నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.