ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఆర్టీసీ అధికారులు కథనం ప్రకారం.. ఉట్నూర్ డిపోకు చెందిన పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ఉట్నూర్ నుంచి మహారాష్ట్రంలోని చంద్రాపూర్కు ఉట్నూర్ నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరింది.
ఇంద్రవెల్లిలో మహారాష్ట్రకు చెందిన గర్భిణి మడావి రత్నమాల బస్సు ఎక్కింది. గుడిహత్నూర్ మండలం మన్కాపూర్ వద్ద గర్భిణి మగ శిశువుకు జన్మనిచ్చింది. తోటి ప్రయాణికులతో ఈ విషయాన్ని గమనించిన బస్ కండక్టర్ గబ్బర్సింగ్, డ్రైవర్లు అంజన్న వెంటనే బస్సును గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
దవాఖాన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయగా వారు తల్లి, బిడ్డలను దవాఖానలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యసిబ్బంది తెలిపారు. డ్రైవర్, కండక్టర్లను ప్రయాణికులు, వైద్యసిబ్బంది, ఆదిలాబాద్ డీవీఎం మధుసూధన్, డీఎం విజయ్లు అభినందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు బస్సులో పుట్టిన బిడ్డకు జీవితకాలం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.