భూత్పూర్, మార్చి 12 : క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలతోపాటు తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. భూత్పూరు మండలం వెల్కిచర్లకు చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు. వీరికి జ్యోతి (14), శైలజ(12), కుమారుడు జశ్వంత్ సంతానం. వీరికి గ్రామ శివారులో రెండెకరాల పొలం ఉన్నది. బుధవారం వ్యవసాయ భూమిలో 300 ఫీట్ల లోతు వరకు బోరు డ్రిల్లింగ్ చేయించగా నీళ్లు పడలేదు. గురువారం మరో బోరు డ్రిల్లింగ్ చేయించడానికి సిద్ధమయ్యాడు.
ఈ విషయమై అతడి భార్య వద్దని వారించినా వినలేదు. భర్త తన మాట వినడం లేదన్న క్షణికావేశంలో ముగ్గురు పిల్లలను తీసుకొని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరు ఆడపిల్లలను బావిలోకి తోయగా.. అప్రమత్తమైన కొడుకు అక్కడి నుంచి తప్పించుకొన్నాడు. తర్వాత శైలజ బావిలో దూకగా.. ముగ్గురు మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే స్థానికులు బావి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సీఐ రామకృష్ణ, ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి జిల్లా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.