వరంగల్ : కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి తీసుకొచ్చిన కొత్త చట్టాలతో సర్పంచులకు అధికారాలు, గ్రామాలకు నిధులు తగ్గిపోయాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం జరిగిన వరంగల్ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ కు సమానమైన గ్రాంటును తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఇస్తూ గ్రామపంచాయతీలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అయితే కొత్త చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం తప్పుడు మాటలతో బీజేపీ సర్పంచులను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 256 కోట్లు విడుదల చేస్తుండగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక సర్పంచ్ లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సర్పంచులకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిని సరైన దారిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.జిల్లా పరిషత్ మీటింగ్ లో చర్చకు వచ్చిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.
రైతులకు అందజేస్తున్న పథకాలను గ్రామాల వారిగా లబ్ధిదారుల జాబితా స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని అధికారులకు సూచించారు.పామ్ ఆయిల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్నదని వెల్లడించారు. వరంగల్ జిల్లాలో 2000 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు చేస్తుండగా దీని వల్ల 6 ఫ్యాక్టరీలు జిల్లాకు రానున్నాయని తెలిపారు.
ఇటీవల హత్యకు గురైన చేర్యాల జడ్పీటీసీ మల్లేశం కుటుబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, నిందితులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మంత్రి దయాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ, పట్టణాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి 18 అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ
సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షత వహించగా, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి , కలెక్టర్ గోపి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీటీసీలు, ఎంపీపీ , ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.